
శీలాన్ని ఆస్తిగా పరిగణించలేమంటూ బొంబాయి హైకోర్టు ఒక కేసులోని నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ వ్యాఖ్యానించింది. సెంట్రల్ రైల్వేకు చెందిన గిరీష్ మాత్రే అనే యువకుడిపై అత్యాచారం (ఐపీసీ 376), మోసం (ఐపీసీ 420) సెక్షన్ల కింద ఒక యువతి ఫిర్యాదు చేసింది. దీనిపై నిందితుడు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు.
కేసు వివరాల ప్రకారం... ఫిర్యాదు చేసిన యువతికి, నిందితుడికి 2007 నుంచి ప్రేమ వ్యవహారం నడిచింది. నిందితుడు మరో యువతిని ఇటీవల పెళ్లాడటంతో పెళ్లి పేరిట అతడు తనపై అత్యాచారం సాగించి, మోసగించాడంటూ మాజీ ప్రియురాలు ఫిర్యాదు చేసింది. అయితే, పరస్పర అంగీకారంతోనే ఇద్దరి నడుమ సంబంధం కొనసాగినందున నిందితుడికి బెయిల్ నిరాకరించలేమంటూ జస్టిస్ ఎం.ఎం.తిప్సే స్పష్టం చేశారు. నిందితుడిపై 420 సెక్షన్ కింద కేసు ఎందుకు నమోదు చేశారంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. మోసపూరితంగా ఏదైనా ఆస్తిని లేదా సంపదను పొందినప్పుడే ఈ సెక్షన్ వర్తిస్తుందని అన్నారు. లోగడ ఒక హైకోర్టు శీలాన్ని సంపదగా పరిగణిస్తూ ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ, ఆ అభిప్రాయంతో తాను విభేదిస్తున్నానని అన్నారు. నిందితుడిపై ఫిర్యాదు చేసిన యువతి పెళ్లికి ముందు శృంగారానికి నిరాకరించి ఉండాల్సిందని అన్నారు.