చెరుకూరి లెనిన్ స్మారక జాతీయ ర్యాంకింగ్ విలువిద్య పోటీలు ఆదివారం విశాఖలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ టోర్నీ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ హీరో రాంచరణ్ తన సతీమణి ఉపాసనతో హాజరవ్వడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. మరో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఓడరేపుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి రాంచరణ్ 'బౌ' ఎక్కుపెట్టి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాంచరణ్ మాట్లాడుతూ, ఒలింపిక్స్లో పతకాలు సాధించే సత్తా మన క్రీడాకారులకు ఉందని, అయితే లండన్ ఒలింపిక్స్లో భారత క్రీడాకారులను దురదృష్టం కూడా వెంటాడిందని అభిప్రాయపడ్డారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందన్నారు.