నవయుగ వైతాళికుడు, తెలుగు సాహిత్యంతో జాతిని మేల్కొలిపిన మహాకవి గురజాడ అప్పరావుకు విశాఖలో ఆదరణ కరువైంది. రాష్ట్రవ్యాప్తంగా మహాకవి 150జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటే..విశాఖలో మాత్రం ఆయన విగ్రహం దిక్కుమొక్కు లేకుండా దర్శనమిస్తోంది.మహాకవి గురజాడ అప్పారావు 150వ జయంత్యోత్సవాలను 50 కోట్ల ఖర్చుతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తోంది. రాజకీయ ప్రముఖులు, అధికార యంత్రాంగం, సాహిత్య ఉద్దండులు మహాకవికి సుమాంజలి ఘటించి ఆయన సేవలను కొనియాడారు. నాటి దురాచారాలపై సమరశంఖం పూరించి, రాష్ఠ్రఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఆ మహాకవికి విశాఖలో ఆదరణ కరువైంది. ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో ఉన్న గురజాడ విగ్రహం బోసిపోయి కనిపిస్తోంది.
విశాఖ ద్వారకా బస్ స్టేషన్ సమీపంలో మహాకవి గురజాడ విగ్రహం ఉండేది. ఫ్లైఓవర్ పనుల నిమిత్తం విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు. దీనిపై సాహితీవేత్తల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అప్పట్లో ఇది పెద్ద దుమారమే రేపింది. విగ్రహాన్ని తొలగించి నాలుగేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు పునఃప్రతిష్టించలేదు. తొలగించిన గురజాడ విగ్రహం GVMC వాటర్ సప్లయ్ పక్కన దిక్కుమొక్కులేకుండా పడేశారు అధికారులు. గురజాడ జయంత్యోత్సవాలకు కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోవడంపై నగరవాసులు మండిపడుతున్నారు.అయితే అధికారులు మాత్రం నాలుగైదు రోజుల్లో ఫ్లైఓవర్ సమీపంలో గురజాడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు.రాజకీయ నేతల విగ్రహాలను ఆఘమేఘాల మీద ఏర్పాటు చేసే అధికారులు..తెలుగుజాతికి గుర్తింపు తెచ్చిన మహానీయుడి విగ్రహ ఏర్పాటులో జాప్యం దారుణమని సాహితీవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో GVMC కమిషనర్ రామాంజనేయులు... కలెక్టర్ లవ్ అగర్వాల్ల మధ్య ఉన్న విభేదాల కారణంగానే విగ్రహం ఆదరనకు నోచుకోలేదన్న విమర్శలున్నాయి.