అసలే నిధుల్లేక నీరసిస్తున్న గ్రామ పంచాయతీ విభాగానికి ప్రభుత్వం షాక్నిచ్చింది. ఆర్థిక సంఘ నిధులపై పెత్తనాన్ని జిల్లా పరిషత్కు అప్పగించింది. నిధుల పంపిణీ అధికారాన్ని కూడా కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.గ్రామ పంచాయతీ పాలక వర్గాల గడువు ఏడాది క్రితం ముగిసిపోయింది. ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో 13వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం నిలుపుదల చేసింది.మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించి స్థానిక సంస్థల పగ్గాలు పాలకులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేయలేదు. దీంతో ప్రత్యేక అధికారుల పాలనలోనే గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, నిధులు విడుదల కాకపోవడానికి తోడు కొత్తగా నిధులను జెడ్పీకి అప్పగించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
13వ ఆర్థిక సంఘం కింద సుమారు మూడు కోట్ల రూపాయలను జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం విడుదల చేసింది. 2012-13 సంవత్సరానికి 1.16 కోట్ల రూపాయాలను జెడ్పీ ఖాతాలో జమ చేసింది. జనాభా లెక్కల ప్రకారం గ్రామ పంచాయతీల్లోని సుమారు 22 లక్షల మందికి ఈ నిధులను సర్దుబాటు చేయాల్సి ఉంది. ఈ నిధులను కేటాయించే బాధ్యతను జిల్లా పరిషత్కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పైగా ఈ నిధులను కేవలం తాగునీటి సరఫరా కోసం ఖర్చు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి అనుగుణంగా, సీపీడబ్ల్యూ పథకాల నిధులను ఖర్చు చేయడానికి జిల్లా పరిషత్ నిర్ణయించింది. దీంతో గ్రామ పంచాయతీల మాజీ పాలక వర్గాలు కంగుతిన్నాయి. ఇప్పటికే జిల్లా పరిషత్ నుంచి నిధులు సర్దుబాటులో తీవ్రమైన జాప్యం జరుగుతున్నదని, తాజాగా పంచాయతీ నిధుల సర్దుబాటు పెత్తనం కూడా జడ్పీకే అప్పగించడం తగదని మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ మాజీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు స్తంభించిపోతాయని వారు ఆందోళన చెందుతున్నారు.