
వారిద్దరూ బాధ్యతాయుతమైన మంత్రి పదవుల్లో ఉన్నారు. మరో మంత్రి కూడా వేదికపై ఉండగానే, అధికారులు, శాసనసభ్యులు, ఆహ్వానితుల సమక్షంలోనే మాటామాటా అనుకున్నారు. మహిళా అమాత్యురాలనైనా చూడకుండా జిల్లా మంత్రివర్యులు ఆగ్రహంతో సభాస్థలి నుంచి నిష్ర్కమించటం అందరినీ ఆశ్చర్యపరచింది. రాతి నుంచి తయారు చేసే ఇసుక వాడకంపై గనుల శాఖ నగరంలోని వైశాఖి జల ఉద్యానవనంలో గురువారం నిర్వహించిన వర్క్షాప్లో చోటు చేసుకున్న సంఘటన ఇది. గనుల శాఖా మంత్రి గ ల్లా అరుణ కుమారి ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా జిల్లాకు చెందిన మంత్రులు పి.బాలరాజు, గంటా శ్రీనివాసరావు, పలు శాఖలకు చెందిన ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి బాలరాజు ప్రసంగిస్తూ సహజ వనరులకు పుట్టిళ్లయిన గిరిజన, గ్రామీణ ప్రాంతీయుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచకుని విధానాలు రూపొందించాలన్నారు. ఇసుక నిషేధం పేరుతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు నాటుబళ్లపై ఇసుకను తరలిస్తున్న ఏజెన్సీవాసులపై గనుల శాఖాధికారులు తమ ప్రతాపం చూపటం ఎంతవరకూ సబబూ అని ప్రశ్నించారు. అసలు ఇసుక మాఫియా ఎవరు? ఇసుక మీద నిషేధంతో ఆందోళన చెందుతున్న వర్గాలేవి? అన్నది గుర్తించకుండా ఇలాంటి వేదికలపై రూపొందించే విధానాలు పేదలకు ఏ రకంగా ఉపయోగపడతాయో ఆలోచించాలని ఆయన ఆవేశంగా అన్నారు. తన కళ్ల ముందే మాఫియాకు చెందిన వ్యక్తులు ఇసుకను లారీల కొద్దీ తరలించుకుపోతున్నారని వారిని వదిలిపెట్టి గిరిజనులను వేధిస్తున్నారని, మైనింగ్ అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా వినడం లేదని వాపోయారు. ‘మా ప్రాంతంలోని సహజవనరులను మేం ఉపయోగించుకోవటంలో తప్పేమిటి?’ అంటూ తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.
ముఖ్యఅతిథి, మంత్రి అరుణ కుమారి మాట్లాడుతూ ‘మంత్రి బాలరాజు పదేళ్లుగా విశాఖలో కాపురం పెట్టారు. విమానాల్లో తిరుగుతున్నారు. గిరిజన గ్రామాల్లో ఉన్న సమస్యలు గ్రామాల్లో లేని వారికేం తెలుస్తాయి? ఇప్పటికీ మా స్వగ్రామంలో వారానికి రెండుసార్లు అక్కడి ప్రజలతో గడుపుతాను. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుంటాను. అలా అయితేనే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి’ అని తీవ్ర స్వరంతో అన్నారు. ఇసుక గిరిజన ప్రాంతాల్లో మాఫియా తీసుకెళ్లినపుడు మంత్రి బాలరాజు ఎందుకు అడ్డుకోలేదని ఎదురు ప్రశ్నించారు. పక్కనే ఉన్న బాలరాజు ఈ మాటలకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘మీ మీద గౌరవం ఉంది. అది నా డ్యూటీ కాదు. ఇప్పటికీ చూపిస్తా. మాఫియా ఇసుకను ఎలా తరలించుకుపోతున్నారో. మీరేం చేస్తున్నారు? మీ ఆఫీసర్లేం చేస్తున్నారు?’ అంటూ ఎదురు ప్రశ్నించారు. దాంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ రకంగా కొద్దిసేపు ఇరువురి మధ్య వాదనలు జరిగాయి. సహనం కోల్పోయిన బాలరాజు విసురుగా వేదిక దిగి వెళ్లిపోయారు. మైనింగ్శాఖ అధికారి సుశీల్కుమార్ మంత్రిని బ్రతిమిలాడినా వెనుతిరగలేదు.