
దక్షిణ భారత దేశ అంతర్ విశ్వవిద్యాలయాల మహిళల వాలీబాల్ పోటీలు ఆదివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నాలుగురోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 55 విశ్వవిద్యాలయాల నుండి జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుంటూరు అసిస్టెంట్ రీజనల్ మేనేజర్ వి.వేణుగోపాల్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ కీర్తి ప్రతిష్టలు పెంచేవి క్రీడలేనన్నారు. దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లగలవారు మహిళలేనన్నారు. దక్షిణ భారత స్థాయి పోటీలను నాగార్జున వర్శిటీ నిర్వహించడం అభినందనీయమన్నారు.
సభకు అధ్యక్షత వహించిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.వియన్నారావు మాట్లాడుతూ ఆచార్య నాగార్జున వర్శిటీ క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా స్పోర్ట్స్ హాస్టల్ను కూడా ప్రారంభించినట్లు తెలిపారు. వర్శిటీలో ఎంతో మంది విద్యార్థులను క్రీడల్లో ప్రావీణ్యత కల్పించి మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహంతోపాటు పదిశాతం మార్కులు కూడా ఇస్తున్నామన్నారు. ఎఎన్యు క్రీడాభివృద్ధిని గుర్తించి నేతాజీ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ పాటియాల వారు నాలుగు క్రీడాంశాల్లో సర్టిఫికెట్ కోర్సులను నిర్వహించడానికి అనుమతి ఇచ్చారన్నారు.
సౌత్జోన్ మహిళల వాలీబాల్ టోర్నమెంట్ పరిశీలకులుగా విచ్చేసిన పాండిచ్చేరి వర్శిటీ ప్రొఫెసర్ టి.కె.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎఎన్యులో పోటీలు చక్కగా నిర్వహిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా వాలీబాల్లో అర్జున, ద్రోణాచార్య అవార్డు సాధించిన ఎ.రమణరావును వర్శిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
...avnk