గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో భూ మాఫియా కేసు కీలక మలుపు తిరిగింది. నిందితులు, బాధితులు రాజకీయంగా, ఆర్థికంగా బలవంతులు కావడంతో రాజధాని స్థాయిలోనే పావులు కదులుతున్నాయి. ఇరువర్గాలు కాంగ్రెస్, టీడీపీలకు చెందినవారు కావడంతో ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు. కేసులో ఎ-5గా ఉన్న గద్దె శ్రీహరిబాబుకు నగరానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేతో సత్సంబంధాలుండటంతో ఈ కేసు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్దకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. సబిత శనివారమే సీఐడీ డీజీ రమణమూర్తితో మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.
ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసి జ్యూడీషియల్ రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. కేసులో ఐదో నిందితుడు హరిబాబును ఆదివారం సీఐడీ కార్యాలయంలో విచారించారు. అతడికి సంబంధించిన డాక్యుమెంటరీ ఆధారాలుంటే తమకు ఇవ్వాలని బాధితుల్ని సీఐడీ పోలీసులు కోరారు. ఈ నలుగురిని తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ వర్గాలు సోమవారం న్యాయస్థానాన్ని కోరనున్నట్లు తెలిసింది. కోర్టు అనుమతిస్తే మరికొన్ని రోజుల పాటు వీరిని విచారించే అవకాశం ఉంది. నిందితులు చిరుమామిళ్ల సాంబశివరావు, గారపాటి భుజంగరావు, నగరంలో ఓ హోటల్ అధినేత వద్ద పనిచేసే డ్రైవర్ శ్రీనివాసరావు, ఓ ప్రైవేటు కంపెనీలో వాహనాల రిజిస్ట్రేషన్ల వ్యవహారాలు చూసే షేక్ రఫీలకు సీఐడీ పోలీసులు శనివారం ప్రభుత్వాస్పత్రిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి జ్యూడీషియల్ రిమాండ్కు పంపారు.