
పాతబస్తీలోని లాల్దర్వాజా మహంకాళీ ఆలయంలో వెండి బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం తెల్లవారు జామున మహంకాళీ ఆలయంలో దొంగతనం జరిగినట్లు ఆలయ పూజారి గుర్తించి పోలీసులకు, ఆలయ కమిటీ నిర్వహకుల దృష్టికి తీసుకువెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు అనుమానంపై పాత నేరస్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. దొంగలను అరెస్టు చేయాలంటూ స్థానికంగా ఆందోళనలు జరగడంతో హైదరాబాద్ సిటీ పోలీసు యంత్రాంగం కేసును సిసిఎస్ బదిలీ చేశారు. ఇటు ఛత్రినాక పోలీసులు అటు సిసిఎస్ పోలీసులు, టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి దొంగల కోసం వేట ప్రారంభించారు. అయినా ఫలితం దక్కలేదు.
ఈ తరుణంలో గురువారం రాత్రి ఉప్పల్ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న ఓ వ్యక్తిని ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే అతను సరైన సమాధానాలు చెప్పకపోవడంతో స్టేషన్కు తీసుకువెళ్లి విచారించారు. లాల్దర్వాజాలోని మహంకాళీ ఆలయంలో దొంగతనం చేసింది తానేనని ఒప్పుకోవడంతో పాటు జంటనగరాల్లో మరో 13 దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు. అంతేకాకుండా విజయవాడ దుర్గగుడిలో దొంగతనం చేసింది కూడా తానేనని ఒప్పుకున్నాడు. దీంతో ఉప్పల్ పోలీసులు సాహూను మల్కాజిగిరి సిసిఎస్ పోలీసులకు అప్పగించారు. ఏడాది క్రితం హైదరాబాద్ వచ్చిన సాహూ హైదరాబాద్తో పాటు నగర శివార్లలో దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు.
సాహూ ఛత్తీస్ఘడ్కు చెందిన వాడని, విజయవాడలోని దుర్గగుడిలో దుర్గాదేవి వజ్ర కిరీటాన్ని దొంగతనం చేసినట్లు అంగీకరించాడు.
ఇదిలావుండగా మహంకాళి ఆలయంలో దొంగతనం వ్యవహారం పెద్ద దుమారాన్నే రేపింది. దోపిడీ జరిగినట్లు తెలుసుకున్న స్థానికులు, పలు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు దేవాలయం ప్రాంతంలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. షాపులను మూసివేశారు. ఆర్టీసి బస్సులు, రోడ్డుపై వాహనాలు రాకుండా అడ్డుకున్నారు. దొంగను అరెస్టు చేయాలంటూ కమిషనర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తామని వందలాది మంది లాల్దర్వాజా నుంచి బయలుదేరారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వెంటనే కమిషనర్ అనురాగ్శర్మ, దక్షిణ మండలం డిసిపి అకున్సబర్వాల్ రంగంలోకి దిగారు. అందోళన కారులను సముదాయించి ర్యాలీని అడ్డుకున్నారు. అయితే గురువారం ఉదయం కూడా లాల్దర్వాజా ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దొంగను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారంటూ ఆరోపణలు చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో మరోసారి పోలీసులు రంగంలోకి దిగారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ప్రత్యేక పోలీసు దళాలను మోహరించారు. మంత్రి గీతారెడ్డి వచ్చి ప్రజలను సముదాయించే యత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బిజెపి, ఇతర పార్టీల నేతలు కూడా ఆందోళనలో పాల్గొనడంతో పరిస్థితి ఇంకా విషమించింది. పోలీసులు, అటు ఆలయ కమిటీ సభ్యులు ఆందోళన కారులను సముదాయించి కేసు విచారణను సిసిఎస్కు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించడంతో పరిస్థితి సద్దుమణిగిన విషయం తెలిసిందే.
...avnk