సికింద్రాబాద్ రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. కిటకిటలాడే రద్దీ, స్టేషన్ ఎదుట బారులు తీరే వాహనాలు, ఫుట్పాత్ వ్యాపారాలు, వీటి మధ్య బారేడు లగేజీతో బస్టాప్కు చేరుకునేందుకు ప్రయాణికులు పడుతున్న అవస్థలకు ఇక బ్రేక్ పడనుంది. వారి ఇబ్బందులకు చెక్ చెప్పేందుకు ‘స్కైవాక్’ అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్ స్టేషన్లో దిగినవారు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఎక్కువగా సిటీబస్సులను ఆశ్రయిస్తుంటారు. ఒక్కో ప్రాంతానికి వెళ్లాల్సిన వారు ఒక్కో చోటకు వెళ్లాలి. దిల్సుఖ్నగర్ వైపు వెళ్లేవారు రేతిఫైల్ బస్టాప్కు, నాంపల్లి, అఫ్జల్గంజ్ వైపు వెళ్లే ప్రయాణికులు అల్ఫా హోటల్ దగ్గరి బస్టాప్కు చేరుకోవాలి.ఇలా ఒక్కోవైపు వెళ్లాల్సిన వారికి ఒక్కోచోట బస్టాప్లున్నాయి. ఈ స్టాప్లున్నీ స్టేషన్కు దాదాపు 250 మీటర్ల దూరంలో ఉన్నా యి.
రైలు దిగిన, స్టేషన్కు వచ్చిన ప్రయాణికులు.. బస్టాప్కు వెళ్లాలంటే ప్రస్తుతం బోలెడు ఇబ్బందులు పడుతున్నారు. నడుద్దామంటే చోటు లేదు. రహదారుల నిండా వాహనాలు, ఫుట్పాత్లపై చిరువ్యాపారాలు. ఈ నేపథ్యంలో అడుగు తీసి అడుగు వేసేందుకు నానా ఇక్కట్లు తప్పడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి ముంబై మహానగరం (బాంద్రా స్టేషన్-బాంద్రా కుర్లా కాంప్లెక్స్) తరహాలో స్కైవాక్ ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.అక్కడ దాదాపు రెండు మైళ్ల దూరం వరకు స్కైవాక్లు ఎంతో ఉపయుక్తంగా ఉండటాన్ని గుర్తించిన అధికారులు.. నగరంలోనూ వీటిని నెలకొల్పాలని, అందుకుగాను ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్ నుంచి రేతిఫైల్ బస్టాప్ వరకు స్కైవాక్కు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ మేరకు డీపీఆర్కు కన్సల్టెంట్ను నియమించారు. స్టుప్ కన్సల్టెంట్స్ తన నివేదికను అందజేసింది. దాన్ని స్టాండింగ్ కమిటీ ముందుంచగా, ఆమోదం లభించింది. ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.7 కోట్లు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, రేతిఫైలి బస్టేషన్ లకు సమీపంలోని చిలకలగూడ, కీస్ హైస్కూల్, అల్ఫాహోటల్, గురుద్వారా బస్టాపుల నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు అధిక సంఖ్యలో ఉండటాన్ని పరిగణనలోకి తీసుకొని, అందరికీ ఉపకరించేలా ఈ స్కైవాక్ను ప్రతిపాదించారు.కీస్ హైస్కూల్-రేతిఫైలి-రైల్వేస్టేషన్-గురుద్వారా టెర్మినస్ల మధ్య పాదచారులెక్కువ కావడాన్ని పరిగణనలోకి తీసుకొని దీన్ని రూపొందిం చారు. రైల్వే స్టేషన్-క్లాక్టవర్ వరకు మెట్రో రైలు మార్గం రానుండటంతో ఆ మార్గంలో గురుద్వారా టెర్మినస్ వరకు స్కైవాక్ ఏర్పాటుచేయలేమని భావించారు. స్కైవాక్ రైలు ప్రయాణికులకు ఉపయోగపడనుండటంతో మెట్రోరైలు నిర్మాణవ్యయంలో దాదాపు రూ.3 కోట్లు భరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇదీ స్వరూపం..
- రేతిఫైలి బస్ స్టేషన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు స్కైవాక్ ఏర్పాటు
- స్కై వాక్పైకి చేరుకునేందుకు నాలుగు చోట్ల ఎంట్రీ/ఎగ్జిట్
- ఎంట్రీ, ఎగ్జిట్ల వద్ద ఎస్కలేటర్, మెట్లు ఉంటాయి
- స్కైవాక్ వెడల్పు 4 మీటర్లు, పొడవు 450 మీటర్లు.
- రహదారి సెంట్రల్ మీడియన్ పైన స్కైవాక్ ఏర్పాటు చేస్తారు
- రేతిఫైలి బస్టాప్, దాని ఎదురుగా, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, స్టేషన్ ఎదుటి బస్టాప్ల వద్ద ఎంట్రీ/ఎగ్జిట్లు.