ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)లో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నా సర్కారుకు మాత్రం చీమకుట్టినట్లు కూడా లేదు. టోల్ ఫీజు చేతి కందితే చాలు మిగతా వ్యవహారాలు కాంట్రాక్టరే చూసుకొంటార ని హెచ్ఎండీఏ భావిస్తోంది. ఓఆర్ఆర్ మన వ్యవహారం కాదుగదా, దాని బాగోగులు, కష్టనష్టాలు మనకెందుకులే అన్నది రవాణా శాఖ ఉద్దేశం. ఎవరైనా చనిపోతే రంగంలోకి వస్తాంగానీ, లేనిపోని అత్యుత్సాహమెందుకు అన్నది పోలీసుల అభిప్రాయం. ప్రమాదం జరిగితే మా అవసరం ఉంటుందిగానీ, వాటి నివారణకు మా పాత్ర ఏముంటుందన్నది వైద్య, రెవెన్యూ విభాగాల నిర్లక్ష్యం. ఇలా ఎవరికి వారు గిరిగీసుకుని కూర్చోవడంతో ప్రతిష్టాత్మక ఔటర్ రింగ్రోడ్డు నగరవాసులను బెంబేలెత్తిస్తోంది. అతిపెద్ద రవాణా వ్యవస్థ నిర్వహణను అస్తవ్యస్తంగా రూపుదిద్దిన ఘనతను హెచ్ఎండీఏ దక్కించుకుంటోంది. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు నిర్మించామని గొప్పలు చెబుతున్న ఔటర్పై పూర్తిస్థాయిలో రాకపోకలు మొదలు కాకముందే 70 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో ఉండాల్సిన ప్రమాణాలు ఔటర్పై ఒక్కటి కూడా అమలు కావడం లేదని ‘న్యూస్లైన్’ పరిశీలనలో వెల్లడైం ది. ఇంజినీరింగ్ (నిర్మాణ), ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్ వంటి లోపాలతోనే ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నది తేలింది.
ఇంజినీరింగ్ లోపాలు...
రహదారి నిర్మాణంలో కొన్ని చోట్ల ఇంజినీరింగ్ లోపాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు వీలుగా నిర్మించే మార్గంలో ఎక్కడా గతుకులకు అవకాశం ఉండకూడదు. కానీ, ప్రధాన రోడ్డు అనేకచోట్ల ఎగుడు దిగుడుగా ఉంది. మితిమీరిన వేగంతో వెళ్లే పవర్ స్టీరింగ్ వాహనాలు కాస్త దిశమారినా అంతే సంగతి. మలుపుల వద్ద కూడా వాహనాలు పల్టీ కొడుతున్నాయి. అవసరమైన చోట సూచికలు ఏర్పాటు చేయకపోవడం పెద్ద లోపంగా కన్పిస్తోంది. ఒక జంక్షన్ నుంచి మరో జంక్షన్కు మధ్యలో 500 మీటర్లకు ఒక సైన్బోర్డును, తర్వాత 100 మీటర్లకు ఒకటి, కిందకు దిగేచోట వద్ద మరొకటి చొప్పున విధిగా సూచికల బోర్డులు ఏర్పాటు చేయాలి. చాలా చోట్ల ఇవి కనిపించడం లేదు. ఎగ్జిట్ పాయింట్ వద్దే సూచికలను ఏర్పాటు చేయడంతో దానిని గుర్తించని వాహనచోదకులు ముందుకెళ్లిపోతున్నారు. ఆ తర్వాత జంక్షన్లో కిందికి దిగి వెనక్కిరావాల్సి వస్తోంది. ఎగ్జిట్ పాయింట్ వద్ద సూచికలను చూసి వాహనదారులు కంగారుపడి సడెన్ బ్రేక్ వేస్తే వెనుక నుంచి వేగంగా వస్తున్న వాహనం ఢీకొని ప్రమాదం సంభవిస్తోంది.
ఎన్ఫోర్స్మెంట్ నిల్...
ఔటర్పై ట్రాఫిక్ పోలీసుల నిఘా లేకపోవడంతో ప్రమాదాలు వాటిల్లుతున్నాయి. ప్రధాన రహదారిపై ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు ప్రవేశం లేకపోయినా వారు యథేచ్ఛగా వచ్చేస్తున్నారు. ఒకే మార్గంలో ఎదురెదురుగా వచ్చే వాహనాలూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కూడళ్ల వద్ద లైటింగ్ ఏర్పాటు చేయకపోవడం కూడా కారణమే. కార్లు, లారీలు మితిమీరిన వేగంతో ఔటర్పైకి రావడంతో ఎదురుగా వచ్చే వాహనంతో ఢీకొంటున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు సమాచారాన్ని చేరవేసేందుకు ప్రతి కిలోమీటరుకు ఒకటి చొప్పున ఉండాల్సిన ఎమర్జెన్సీ కాల్ బాక్స్లు ఎక్కడా కన్పించట్లేదు. ట్రాఫిక్ కంట్రోల్ నంబర్లు లేవు, రెస్క్యూ టీమ్లు, సీసీ కెమెరాలను ఏ ర్పాటు చేయలేదు. ఏదైనా వాహనం మరమ్మతులకు గురైతే దాన్ని తరలించే సదుపాయం లేదు. మితిమీరిన వేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించేందుకు స్పీడ్ గన్స్ను ఏర్పాటు చేయలేదు. రవాణా రద్దీని గుర్తించే ఆటోమేటిక్ ట్రాఫిక్ కౌంటర్ సెంటర్లను కూడా అందుబాటులోకి తేలేదు. ఔటర్పైకి చేరుకునే పశువులు, జంతువులతో రాత్రుల్లో ఘోరం జరిగిపోతోంది.