హైదరాబాద్లో కొత్త విమానాశ్రయం రానుందా? శం షాబాద్ గాకుండా మరో విమానాశ్రయానికి అవకాశాలున్నాయా? ఇది నిజమేనంటోంది ఓ అంతర్జాతీయ విమానయాన కన్సల్టెన్సీ దిగ్గజం. కేవలం హైదరాబాద్లోనే కాదు మరో పదేళ్లలో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్కతా నగరాల్లో డబుల్ ఎయిర్పోర్టులు కార్యరూపం ధరిస్తాయని తమ సర్వేలో తేలియనట్లు సెంటర్ ఫర్ ఆసియా-ఫసిఫిక్ ఏవియేషన్ (కాపా) ప్రకటించింది. దేశ వాణిజ్య రాజధాని నగరంగా ఖ్యాతి గడించిన ముంబైలో ముచ్చటగా మూడో ఎయిర్పోర్టుకు ఛాన్స్ ఉందని ఈ సంస్థ అంచనా వేసింది.ఈ నగరాల్లో ఎయిర్ ట్రాఫిక్ శరవేగంగా పెరుగుతోందని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాలు పెరిగే డిమాండ్ను తీర్చేస్థాయిలో ఉండవని కాపా నిర్ధారించింది. ఇంతకుముందు హైదరాబాద్లో బేగంపేట విమానాశ్రయం ఉండేది. శంషాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రతిపాదించిన తర్వాత ఈ ఎయిర్పోర్ట్ను చిన్న చిన్న విమానాలకు ఉపయోగించాలని ప్రతిపాదించారు. దీనివల్ల తన అస్తిత్వం దెబ్బతింటుందని జిఎంఆర్ వాదించడంతో బేగంపేట ఎయిర్పోర్టును శాశ్వతంగా మూసివేయాల్సివచ్చింది. దీనితో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒక్కటే ఎయిర్ట్రాఫిక్ అవసరాలను తీర్చుతోంది. ప్రతీ ఏటా శంషాబాద్ ఎయిర్పోర్టు పాసింజర్ల ట్రాఫిక్ పరంగా మెరుగైన వృద్ధిరేటును నమోదు చేస్తోంది.
ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకున్న కాపా పదేళ్లలో హైదరాబాద్కు రెండో ఎయిర్పోర్టు అవసరమని నిర్ధారించింది.13 ఎయిర్పోర్టులు కావాలి.. మెట్రో నగరాల్లో రెండో ఎయిర్పోర్టులే కాదు.. నాన్ మెట్రో నగరాల్లోనూ ఎయిర్ ట్రాఫిక్ జెట్స్పీడ్తో పెరుగుతోందని కాపా గుర్తించింది. నాన్ మెట్రో నగరాలు సైతం భారీ వృద్ధిరేటుతో దూసుకుపోతున్నాయని, ప్రస్తుతం ఈ నగరాల్లో ఉన్న మౌలిక వసతులు ఎయిర్ట్రాఫిక్ అవసరాలను తీర్చేసామర్థ్యం కలిగిలేవని ఈ సంస్థ స్పష్టం చేసింది. అందుకే మెట్రోలలో డబుల్ ఎయిర్పోర్టులతో పాటు నాన్ మెట్రో నగరాల అవసరాలను పరిగణలోకి తీసుకుంటే మొత్తం 13 ఎయిర్పోర్టులు అవసరమని ప్రకటించింది. మరో పదేళ్లలో వాస్తవ రూపం ధరించే ఈ ఎయిర్పోర్టు ప్రాజెక్టులకు లక్షన్నర కోట్ల రూపాయలు(30000 కోట్ల డాలర్లు) అవసరమని సిడ్నీ కేంద్రంగా పనిచేసే ఈ కన్సల్టెన్సీ సంస్థ తేల్చిచెప్పింది. ముంబై నగరాన్ని మినహాయిస్తే.. ఇతర మెట్రో నగరాల్లో ఉన్న ఎయిర్పోర్టులకు కొన్నేళ్ల పాటు ఎయిర్ట్రాఫిక్ అవసరాలను తీర్చగలిగే సామర్థ్యం ఉందని ఈ సంస్థ వ్యాఖ్యానించింది. ఆ తర్వాత మరింత పెరిగే డిమాండ్ను తీర్చడం వీటి వల్ల కాకపోవడంతో కొత్త ఎయిర్పోర్టుల అవసరం ఏర్పడుతుందని కాపా విశ్లేషించింది. ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో మరో పదేళ్ల వరకూ ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్టులే సరిపోతాయని, అయితే.. చెన్నై ఎయిర్పోర్టు 2017 నాటికే పెరిగే ట్రాఫిక్ను నియంత్రించలేక చేతులెత్తేస్తుందని తెలిపింది.
ఇతర మెట్రో నగరాల్లోనూ కొంచెం అటు ఇటుగా ఇదే పరిస్థితి నెలకొంటుందని తెలిపింది.నాన్ మెట్రోలలో ముందుగానే.. దేశంలో 35 కీలకమైన నాన్ మెట్రో ఎయిర్పోర్టులలో డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోయింది. ఈ జాబితాలోని కొన్ని నగరాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వసతులకు మించిన అవసరాలు రంగంలోకి వచ్చాయి. మిగిలిన నగరాల్లో ఒకటి, రెండేళ్లలోనే ఈ పరిస్థితులు తలెత్తవచ్చని కాపా అంటోంది. పూణె, పాట్నా, జైపూర్, నాగ్పూర్, లక్నో నగరాల ఎయిర్పోర్టులపై తక్షణమే దృష్టి పెట్టాలని, యుద్ధప్రాతిపదికన విమానాశ్రయాలను విస్తరించాలని ఈ కన్సల్టెన్సీ సూచించింది. ఈ సమస్యను గుర్తించడంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, కొన్ని పాత విమానాశ్రయాల్లో కొత్త టెర్మినళ్లను నిర్మిస్తే సరిపోతున్నా మరికొన్ని నగరాల్లో మాత్రం కొత్త విమానాశ్రయాలు తప్పనిసరి అని ఈ సంస్థ అభిప్రాయపడింది. దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని దేశం సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని, కనీసం 30 ఏళ్ల అవసరాలను ముందుగానే అంచనా వేసి ఆ దిశగా వసతుల కల్పనకు నడుం బిగించాలని కాపా హితవు చెప్పింది.
