నగర నడిబొడ్డున హౌరా బ్రిడ్జి వెలియనుంది.! ఇదేంటి కోల్కతలో ఉండాల్సిన బ్రిడ్జి నగరంలో ఏంటని ఆశ్చర్యపోతున్నారా ..? అచ్చం హౌరా బ్రిడ్జిని పోలిన విధంగా జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 45ను అనుసంధానం చేస్తూ దుర్గం చెరువుపై ఈ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హైటెక్ సిటీ, మాదాపూర్, సైబరాబాద్లలో పెరిగిన ట్రాఫిక్ రద్దీని తగ్గించే ఏర్పాట్లలో భాగంగా ఈ బ్రిడ్జి ప్రతిపాదనలను తెరపైకి తీసుకొచ్చారు. ఇక్కడ తొమ్మిది రహదారుల విస్తరణ పనులతో పాటూ దుర్గం చెరువుపై నిర్మించే బ్రిడ్జి బాధ్యతను ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)కు అప్పగించింది. సదరు ప్రాజెక్టులకు అయ్యే వ్యయాన్ని పారిశ్రామిక మునిసిపాలిటీ (ఐలా) భరించనుంది.సుమారు 350 మీటర్లలో .. జూబ్లీహిల్స్ మీదుగా హైటెక్ సిటీ, మాదాపూర్ వైపునకు వెళ్లే రహదారులు కిటికిటలాడుతున్నాయి. పెరుగుతున్న వాహనాలు .. విస్తరిస్తున్న నగరంతో పరిసరాల్లో ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఫలితాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. అందులోనూ ఈ పరిసర ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ రహదారులు లేకపోవడం సైతం ట్రాఫిక్ సమస్య మరింత జఠిలం కావడానికి కారణమవుతోంది. వీటినన్నింటినీ పరిగణలోకి తీసుకున్న సైబరాబాద్ పారిశ్రామిక మునిసిపాలిటీ ప్రత్యామ్నాయ చర్యలకు రంగం సిద్ధం చేసింది.
అందులో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 45 నుంచి అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ గుండా దుర్గం చెరువుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టడానికి ప్రతిపాదనలు చేశారు. ఈ బ్రిడ్జి జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 45 నుంచి దుర్గం చెరువుకు అటువైపున ఉన్న ఇనార్బిట్ మాల్కు అనుసంధానంగా ఉంటుంది. దీంతో మాదాపూర్, హైటెక్ సిటీల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చని అధికారులు భావించారు. అలాగే దుర్గం చెరువు పరిసరాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి 'ఐలా' చేస్తున్న కృషిలో ఈ బ్రిడ్జి నిర్మాణమూ ఓ భాగమేనని అంటున్నారు. హౌరా తరహాలో ఉండే ఈ బ్రిడ్జి పొడవు సుమారు 350 మీటర్లు .. కాగా దీని నిర్మాణానికి అంచనా వ్యయం రూ. 200 కోట్లు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడానికి జీహెచ్ఎంసీ 'రైట్స్' కన్సల్టెంట్ను రంగంలోకి దింపింది. సదరు సంస్థ ఆగస్టు కల్లా పూర్తి నివేదికను (డీపీఆర్)ను సమర్పించనున్నట్లు అధికారులు చెప్పారు.