
దశల వారీగా చేపట్టిన మెట్రో రైలు పనుల స్పీడ్ను ఎల్అండ్టీ ఇంజనీర్లు పెంచేశారు. ఇన్నాళ్లు భూ సామర్థ్య పరీక్షలతో బిజీగా గడిపిన ఇంజనీర్లు ..తాజాగా పిల్లర్ల నిర్మాణంలో తలమునకలవుతున్నారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పిల్లర్లను ఏర్పాటు చేస్తుండటంతో వీటి నిర్మాణం త్వరితగతిన పూర్తి అవుతోంది. పిల్లర్ల నిర్మాణంలో క్యూరింగ్ చేయడానికి వీరు నీటిని వాడటం లేదు. నీటికి చెక్ పెట్టిన ఎల్అండ్టీ ఇంజనీర్లు ప్రత్యామ్నాయంగా క్యూరింగ్ కాంపౌండ్ ద్వారా ప్రత్యేకమైన రసాయనాలను క్యూరింగ్ కోసం వినియోగిస్తున్నారు. దీంతో పిల్లర్లు నిర్మిస్తున్న ప్రాంతంలో ఎక్కడా వీటి నిర్మాణానికి సంబంధించిన ఆనవాళ్లు ఉండటం లేదు. ముఖానికి ఫేషియల్ చేసిన ట్టుగా ఆయా పిల్లలపై క్యూరింగ్ చేసిన తెల్లని రసాయనాలు దర్శనమిస్తున్నాయి.
ఈ విధంగా నెలకు సులువుగా 10 -15 పిల్లర్ల నిర్మాణం చేపట్టగల సామర్థ్యం ఎల్అండ్టీకి ఉన్నట్లు ఆ సంస్థ ఎండీ వి.బి.గాడ్గిల్ తెలిపారు. ఇప్పటికి వరకు 15 పిల్లర్లు 33 సెగ్మెంట్లు సిద్ధమైనట్లు తెలిపారు.ఆరుదశల్లో పనులు .. నగరంలో మూడు కారిడార్లలో ఈ సంస్థే మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే. మొత్తం 71.16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణ కార్యక్రమాన్ని ఆరు దశలుగా విభజించారు. ఎల్అండ్టీ, హైదరాబాద్ మెట్రో వర్గాలు ఇంతకుముందు ప్రకటించిన నిర్మాణ షెడ్యూలు ప్రకారం, నాగోలు-మెట్టుగూడ మార్గంలో ఒకటోదశలో పనులు ప్రారంభమయ్యాయి. అలాగే మియాపూర్-ఎస్ఆర్ నగర్ మధ్య రెండోదశ పనులు చురుగ్గాసాగుతున్నాయి. మూడోదశలో మెట్టుగూడ-బేగంపేట మధ్య, నాలుగోదశలో బేగంపేట-శిల్పారామం మధ్య, ఐదోదశలో ఎస్ఆర్నగర్-ఎల్బీనగర్ మధ్య, ఆరోదశలో జేబీఎస్-ఫలక్నుమా మధ్య పనులు కొనసాగుతాయి. మియాపూర్ డిపో వద్ద పనులు కొనసాగుతున్నాయని ఎల్అండ్టీ అధికారులు తెలిపారు. ఉప్పల్ డిపోవద్ద పనులు ముందంజలో ఉన్నాయని, అక్కడే ప్రధాన కమ్యూనికేషన్ సెంటర్ త్వరలో వస్తుందని ప్రకటించారు.
రెడీమేడ్ కారిడార్లు .... పంజాగుట్ట ఫ్లైఓవర్ నిర్మాణంలో గామన్ ఇండియా వినియోగించిన టెక్నిక్నే ఎల్అండ్టీ ఇంజనీర్లు సైతం మెట్రో రైలు నిర్మాణంలో వినియోగిస్తున్నారు. రెడీమేడ్ కారిడార్లను సిద్ధం చేయడం ద్వారా లక్ష్యం సాధించనున్నారు. ప్రతిపాదిత మెట్రో రూట్లో పిల్లర్లను నిర్మించడం .. ఉప్పల్ కాస్టింగ్ యార్డులో తయారు చేసిన సెగ్మెంట్లను వాటిపై నిలబెట్టడం ద్వారా మెట్రో కారిడార్లను ఎల్అండ్టీ ఇంజనీర్లు నిర్మిస్తున్నారు. కారిడార్ ఎత్తు కనీసం 30 అడుగులు లేదా ఆపైనే ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఒక్కొ పిల్లర్కు మధ్య 100 అడుగులు దూరం ఉంటుంది. రెండు పిల్లర్లను కలపడానికి వీరు మూడు నుంచి నాలుగు సెగ్మెంట్లను వినియోగిస్తారు.ఒక్కో సెగ్మెంట్ బరువు 42 టన్నులు . ఈ విధంగా మొదటి దశలో భాగంగా నాగోల్- మెట్టుగూడలో 315 పిల్లర్లు నిర్మిస్తారు. మియాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్ వరకూ 458 పిల్లర్లు నిర్మిస్తారు.