ఇతర శాఖలకు చెందిన భూమిని హెచ్ఎండీఏ ఏకపక్షంగా ఓ ప్రైవేటు సంస్థకు లీజుకు ఇవ్వడం వివాదాస్పదమైంది. సంజీవయ్య పార్కు సమీపంలోని జీహెచ్ఎంసీకి చెందిన ఐదు ఎకరాల భూమిని అప్పటి కమిషనర్ బీపీ ఆచార్య 'ఓ కారు విక్రయాల కంపెనీకి కట్టబెట్టారు. వాస్తవానికి జీహెచ్ఎంసీ ఈ భూమిలో గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేయడం కోసం హెచ్ఎండీఏకు భూమిని ప్రభుత్వ ఆదేశాల మేరకు అప్పగించింది. హెచ్ఎండీఏ అధికారులు పచ్చదనాన్ని పెంపొందించడాన్ని పక్కన పెట్టి ఈ భూములను లీజుకు అప్పగించారు. భూములను పొందిన సంస్థ నిర్వాహకులు నిర్మాణాలు ఆరంభించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రేటర్ గుర్తింపు యూనియన్ బీఎంఎస్ ప్రతినిధులు పనులను అడ్డుకుని జీహెచ్ఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ప్లానింగ్ సిబ్బంది అక్రమ నిర్మాణాలను బుధవారం నిలిపివేశారు.
గతంలో నిర్మించిన కట్టడాలను పాక్షికంగా కూల్చివేశారు.ఖంగుతిన్న నిర్వాహకులు అధికారులపై ఎదురుదాడికి దిగారు. వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు జీహెచ్ఎంసీ ఉద్యోగులను అదుపులోకి తీసుకుని రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. కమిషనర్ ఆదేశాల మేరకు కూల్చివేతలు చేస్తున్నట్లు సిబ్బంది పేర్కొన్నప్పటికీ పోలీసులు వినిపించుకోలేదని బీఎంఎస్ యూనియన్ ప్రతినిధులు ఆరోపించారు. గీన్ బెల్ట్ ఏరియాలో నిర్మాణాలు చేపట్టకూడదన్న నిబంధనల మేరకు ఈ కూల్చివేతలు చేపట్టినట్టు యూనియన్ నాయకులు శంకర్, మల్లికార్జున్లు తెలిపారు. కమిషనర్ ఆదేశాలను సిబ్బంది అమలు చేస్తుంటే పోలీసులు ఏ విధంగా జోక్యం చేసుకుంటారని వీరు నిలదీశారు. యూనియన్ నాయకులు అంతా వివాదాస్పద స్థలంలో ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు వ్యతిరేకంగా ఒక బృందం స్టేషన్ ముందు నిరసన దిగింది. దీంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు కమిషనర్ ఆదేశాల మేరకే కూల్చివేతలు చేపట్టడానికి సిబ్బంది వచ్చినట్లు తెలుసుకుని వారిని వదిలిపెట్టేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది.
వివాదం మొదలైంది ఇలా .... గ్రీన్ బెల్ట్ ఏరియాలో కొంత భూమి గ్రేటర్ హార్టికల్చర్ విభాగం ఆధీనంలో ఉంది. అక్కడ ఓ బోరును సైతం జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. బోరు నీటిని సేకరించి ట్యాంకర్ల ద్వారా హార్టికల్చర్ విభాగం పర్యవేక్షణలో ఉన్న పార్కులకు నీటిని ఇక్కడి నుంచి సరఫరా చేస్తుంటారు. అయితే జీహెచ్ఎంసీ ఈ మొత్తం భూమిని గ్రీన్ బెల్ట్గా ప్రకటిస్తూ .. హెచ్ఎండీఏకు అప్పగించింది. హెచ్ఎండీఏ ఈ స్థలాన్ని లీజుకిచ్చింది. నిర్వాహకులు తమకు లీజుకు కేటాయించిన భూమిలో బోరు, నీటి ట్యాంకర్లను నిలుపడమేమిటని గ్రేటర్ సిబ్బందితో గొడవ పడ్డారు. రెండు రోజుల క్రితం ట్యాంకర్లకు నిర్వాహకులు తాళం సైతం వేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న బీఎంఎస్ ప్రతినిధులు గ్రేటర్ భూమిలో ప్రైవేటు వ్యక్తుల పెత్తనమేమిటని ప్రశ్నించడంతో వివాదం రాజుకుంది.బీఎంఎస్ నాయకుల డిమాండ్ సంజీవయ్య పార్కు పరిసరాల్లో పచ్చదనం ఉండాలని ఉద్దేశంతో జీహెచ్ఎంసీ భూములను హెచ్ఎండీఏకు అప్పగించింది. గ్రీన్ బెల్ట్ను అభివృద్ధి చేయాల్సిన హెచ్ఎండీఏ అందుకు విరుద్ధంగా వ్యవహరించి బీపీ ఆచార్య కమిషనర్గా ఉన్నప్పుడు ఈ భూములను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ లీజును రద్దు చేయాలి.