నిన్నటి దాకా రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తూ పోటీకి తెరలేపిన దేశీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఇప్పుడు ఇతర బ్యాంకుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని చాలా బ్యాంకులు బేసు రేటుపైనే గృహరుణాలను అందిస్తూ, ప్రాసెసింగ్ ఫీజులను పూర్తిగా రద్దు చేశాయి. దీంతో ఎస్బీఐ గృహ, ఆటో రుణాలపై ప్రాసెసింగ్ చార్జీలను సగానికి సగం తగ్గించింది. ఈ తగ్గింపు రేట్లు అక్టోబర్ 17 నుంచి డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటాయని బుధవారం బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది.రూ.25 లక్షలలోపు గృహరుణంపై వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజును 0.25 శాతం నుంచి 0.125 శాతానికి తగ్గించింది. ఈ కొత్త చార్జీల ప్రకారం రూ.25 లక్షల రుణం తీసుకుంటే రూ.3,125 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అదే రూ. 25 లక్షల నుంచి రూ. 75 లక్షలలోపు గృహరుణంపై ఇప్పుడున్న చార్జీ 6,500ను రూ.3,250కి, ఆపై మొత్తానికి తీసుకునే గృహరుణంపై రూ.10,000 నుంచి రూ.5,000కి తగ్గించింది.ఇక కార్ల రుణాల విషయానికి వస్తే ప్రాసెసింగ్ ఫీజును 0.51 శాతం నుంచి 0.255 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కాని ఇప్పటికే సిండికేట్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకు వంటి బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజులను పూర్తిగా ఎత్తివేశాయి. ప్రస్తుతం ఎస్బీఐ మిగిలిన అన్నింటికన్నా తక్కువగా 10 శాతానికే గృహ రుణాలను అందిస్తోంది.
అన్ని బ్యాంకుల కంటే ఎస్బీఐ బేసు రేటు తక్కువగా 9.75 శాతంగా ఉండగా, ఇతర బ్యాంకుల బేసు రేటు 10 నుంచి 10.50 శాతంగా ఉన్నాయి. కొన్ని బ్యాంకులు బేసు రేటుపైనే గృహరుణాలను అందిస్తున్నా అవి ఎస్బీఐ రేటు కంటే ఎక్కువగానే ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు గృహరుణాలను 10.25 శాతానికి ఇస్తూ తక్కువ వడ్డీరేట్లలో రెండో స్థానంలో ఉంటే... ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 10.40 శాతం రేటుతో మూడో స్థానంలో ఉంది.. మిగిలిన బ్యాంకుల దారిలోనే పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ కూడా పండుగలను దృష్టిలో పెట్టుకొని వడ్డీరేట్లను తగ్గించింది.