
లక్ష రూపాయల వరకూ నిధుల ఆన్లైన్(ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్) లావాదేవీలపై చార్జీలు ఎత్తివేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నగదు, చెక్కులుసహా ఇతర అధిక వ్యయ భరిత లావాదేవీల సంఖ్యను తగ్గించి ఎలక్ట్రానిక్ ట్రాన్స్ ఫర్ లావాదేవీలను పెంచే క్రమంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (ఎన్ఈఎఫ్టీ) వ్యవస్థ ద్వారా ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్లోకి లక్ష రూపాయల వరకూ నిధుల బదలాయింపునకు పలు బ్యాంకులు రూ.5 గరిష్ట ఫీజును వసూలు చేస్తున్నాయి. రూ.10,000 వరకూ లావాదేవీపై ఈ ఫీజు రూ.2.50గా ఉంది. కాగా లక్ష రూపాయల నుంచి రూ. 2 లక్షల వరకూ ఎలక్ట్రానిక్ బదలాయింపునకు గరిష్ట చార్జీ రూ. 15. ఈ ఫీజు తగ్గింపుపై ప్రభుత్వం ఎటువంటి సూచనలూ చేయలేదు. బిజినెస్ పరిమాణం భారీగా నమోదయ్యే 20 శాతం బ్రాంచీలను గుర్తించి, ఆయా బ్రాంచీలలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చెక్కు ఆధారిత లావాదేవీల సంఖ్యను కనీసం ఐదవ వంతుకు తగ్గించడంపై దృష్టి పెట్టాలని కూడా బ్యాంకులకు ఆర్థికశాఖ సూచించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.