
ఆసియా కప్ టి20 టోర్నీలో భారత మహిళల జట్టు దుమ్మురేపింది. బ్యాటింగ్లో విఫలమైనా... బౌలింగ్లో సత్తా చాటుతూ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను ఫైనల్లో ఓడించింది. పాక్ తో జరిగిన అంతిమ సమరంలో భారత్ 18 పరుగుల తేడాతో పాక్పై విజయం సాధించి చాంపియన్గా నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 81 పరుగులకు ఆలౌటైంది. పాక్ బౌలింగ్ ధాటికి తొలి రెండు ఓవర్లలోనే ఓపెనర్లు సులక్షణ నాయక్ (2), అనుజా పాటిల్ (0) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే మిడిలార్డర్లో పూనమ్ రౌత్ (28 బంతుల్లో 25; 3 ఫోర్లు), హర్మన్ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 20)లు నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిర్మించారు. భారత్ 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి మరోసారి ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో రీమా మల్హోత్రా (31 బంతుల్లో 18) పాక్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ కౌర్తో కలిసి ఇన్నింగ్స్ను నడిపించింది. కౌర్ అవుటైన తర్వాత లోయర్ ఆర్డర్ నుంచి సహకారం లేకపోవడంతో భారత్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. పాక్ బౌలర్లలో సనా మిర్ 4, మరూఫ్, మరియమ్ హసన్ చెరో రెండేసి వికెట్లు తీశారు.
తర్వాత బ్యాటింగ్కు దిగిన పాక్ 19.1 ఓవర్లలో 63 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. క్వనితా జలీల్ (2) విఫలమైనా... మరూఫ్ (18) కాసేపు పోరాడింది. కెప్టెన్ సనా మిర్ (11)తో కలిసి రెండో వికెట్కు 27 పరుగులు జోడించింది. అయితే ఆరు బంతుల వ్యవధిలో వీళ్లిద్దర్ని అవుట్ చేసిన భారత బౌలర్లు మ్యాచ్పై పట్టు బిగించారు. మిడిలార్డర్లో అబిది (13) నిలబడే ప్రయత్నం చేసినా... రెండోవైపు నుంచి వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ పాక్ను ఒత్తిడిలోకి నెట్టారు. దీంతో 32 పరుగుల తేడాతో చివరి 9 వికెట్లను చేజార్చుకుని ఓటమిపాలైంది. అర్చనా దాస్, నిరంజన చెరో రెండేసి వికెట్లు తీశారు. పూనమ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ’, మరూఫ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ’ అవార్డులు లభించాయి.
