
భారత యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి ఇప్పట్లో కెప్టెన్ బాధ్యతలు అప్పగించొద్దని పాక్ మాజీ కెప్టెన్ వాసిమ్ అక్రం అభిప్రాయపడ్డాడు. 'పరిమిత ఓవర్లలో కెప్టెన్సీ చెప్పట్టడానికి
అతడు ఇంకొన్ని రోజులు వేచి ఉండాలి. గత 18 నెలలుగా కోహ్లీ భారత్కు నమ్మదగ్గ బ్యాట్స్ మన్గా ఉన్నాడు. అతడిని ఆటను ఆస్వాదించనివ్వాలి. ఈ సమయంలో అదనపు బాధ్యతలు అప్పగించి అతడిపై భారం మోపొద్దు. టీమ్ సెలక్షన్ విషయాలు, మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అతడికి భారమే.' అని అక్రమ్ పేర్కొన్నాడు. కెప్టెన్ ధోనీకి అక్రమ్ బాసటగా నిలిచాడు. ధోనీ కెప్టెన్సీ సామర్ధ్యంపై వస్తున్న విమర్శలను తోసిపుచ్చాడు.
ఇటీవల టి20 ప్రపంచ కప్లో భారత్ సెమీస్ చేరడంలో విఫలం కావడంతో ధోనీ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ధోనీ నాయకత్వ లక్షణాలపై తనకు నమ్మకముందని అక్రమ్ తెలిపాడు. అయితే ధోనీ ఏదైన ఒక ఫార్మట్లో కెప్టెన్సీ వదులుకోవాలన్నాడు. అప్పుడే 31 ఏళ్ల ధోనీ ఆటను ఆస్వాదించగలడని పేర్కొన్నాడు. తన కెప్టెన్సీపై పున:సమీక్షించుకోవడానికి అతడికి కొంత సమయం ఇవ్వాలన్నాడు. ధోనీ తన కెప్టెన్సీకి తగిన న్యాయం చేస్తున్నాడని తెలిపాడు. అయితే మూడు ఫార్మట్లకు న్యాయకత్వం వహిచడమే అతడిపై అదనపు ఒత్తిడి పెంచుతోందన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ధోనీ అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్ అని ప్రశంసించాడు. ఐసిసి టి20 ప్రపంచ కప్లో విఫలమైన గౌతమ్ గంభీర్ త్వరలోనే ఫామ్లోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అతడు తిరిగి ఆత్మవిశ్వాసం పొందడానికి మరికొన్ని మ్యాచ్లు అవసరం అన్నాడు.
...avnk