
వరుస వైఫల్యాలతో సతమతమౌతున్న ధోనీ బృందం తాజాగా శ్రీలంకలో జరిగిన టి-20 వరల్డ్ కప్లో కూడా సెమీస్ లో అడుగుపెట్టలేక పోవడం పట్ల తీవ్ర అసంతృప్తితో వున్న బిసిసిఐ ఇక ప్రక్షాళన తప్పదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వరుసగా మూడోసారి కూడా టి-20 వరల్డ్ కప్లో సెమీస్కు చేరకపోవడం ఘోరమైన విషయమని, ఇక ఉపేక్షించలేమని భావిస్తున్న బిసిసిఐ పెద్దలు మూడు ఫార్మేట్లకు ముగ్గురు కెప్టెన్లను ఎంపిక చేసే దిశగా యోచిస్తున్నట్లు సమాచారం. విదేశాల్లో వరుసగా 8 టెస్టులను కోల్పోయిన కెప్టెన్గా ధోనీ అప్రదిష్ట మూట గట్టుకున్నా టెస్టులకు అతన్నే సారధిగా కొనసాగించాలని, ఇక ఇప్పటికే వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న 'రైజింగ్ స్టార్' విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్గా నియమించాలని, ఇక 'పొట్టి' క్రికెట్కు ఆల్రౌండర్ లక్షణాలున్న సురేష్ రైనాను సారధిగా ఎంపిక చేయాలని బిసిసిఐ యోచిస్తునట్లు అది వెల్లడించింది.
ధోనీ కెప్టెన్సీపై అంతకంతకూ విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ఇక ఉపేక్షించడం మంచిదికాదని, వచ్చే టోర్నమెంటుకు ముందుగానే ఈ మార్పులను చేపట్టాలని భావిస్తున్నట్లు అది పేర్కొంది. 'ధోనీని మార్చాల్సిన సమయం ఆసన్నమైందని, వాస్తవానికి అతనిది 'జూదరి ' మనస్తత్వమని, 'టైమ్' బాగున్నంతకాలం అది కలిసి వచ్చిందని, ఇప్పుడు ఎదురుదెబ్బలు తగలడం మొదలైందని' భారత మాజీ స్పిన్నర్ మణిందర్ సింగ్ వ్యాఖ్యానిస్తూ, విదేశాల్లో వరుసగా 8 టెస్టుల్లో పరాజయం ఎదుర్కోవడంతోపాటు ఆసియాకప్, ప్రస్తుత టి-20 వరల్డ్ కప్లో వైఫల్యాలకు ధోనీదే ప్రధాన బాధ్యతని, గతంలోనే తగిన మార్పులు చేపట్టివుంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదని అన్నాడు. అలాగే పలువురు వ్యాఖ్యాతలు, విమర్శకుల నుండి ధోనీకి వ్యతిరేకమైన వ్యక్తం కావడంతో తగిన నిర్ణయాలు తీసుకోక తప్పని స్థితిలో బిసిసిఐ పడిందని తెలుస్తోంది.
...avnk