తెలుగు సినీ ప్రపంచంలో, నౌషాద్వంటి హిందీ సంగీత దర్శకు లచే గుర్చించబడి, గౌరవింపబడ్డ ఒకే ఒక సంగీత దర్శకుడు మన సాలూరు రాజేశ్వరరావు. ఎవరైనా ‘ చైల్డ్ ప్రొజిజీ ’ లు ఉన్నారంటే వాళ్ళలో అందరికన్నా ముందుండే వ్యక్తి సాలూరు రాజేశ్వరరావు.సాలూరు పుట్టింది 1922లో విజయనగరంలో. తండ్రి సాలూరు సన్యాసి రాజు. ఆయన ఆ రోజుల్లో ఎన్నో మంచి పాటలు రాసిన లిరిసిస్ట్. రాజేశ్వరరావుకి సంగీత పరిచయం తండ్రి ద్వారా కలిగింది. సన్యాసిరాజు ఆ రోజుల్లో మూకీ సినిమాలకు తెరముందు సంగీతం ఇచ్చేవారు. అటువంటి వాతావరణలో పెరిగాడు రాజేశ్వరరావు. ఆయన 7 ఏళ్ల వయస్సులోనే రికార్డింగ్ ‘భగవద్గీత’ మీద ఇవ్వటం ఒక గొప్ప విశేషం. స్వయం ప్రతిభతోనే మొదటి సినిమాకి ఆయనకు పిలుపు వచ్చింది 1935లో. సినిమా పేరు ‘శ్రీకృష్ణ లీలలు’ అ సినిమాలో కృష్ణూడుగా నటించి పాడిన పాటలు, పద్యాలలో 13 సంవత్సరాల సాలూరు చూపించిన అధికారం, వైవిధ్యం, వాటిలో ఉన్న గమకాలు గమనిస్తే అప్పటికే తిరుగులేని గాయకుడుగా, సంగీతకారుడుగా ఎలా నిబడగలిగాడో అర్థమౌతుంది. ‘చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరుని మురళి ’, ఓహో యాత్రికుడా వంటి ప్రైవేటు రికార్డుల్లో ఆయన సంగీతంతో కలిసిన గొంతును ఇప్పటికీ ఆతరం వారు మర్చిపోలేరు.
రావు బాలసరస్వతి, సాలూరు రాజేశ్వరరావుల జంట పాడిన పాటలు 1940 దశాబ్దంలో తెలుగునాట ఒక సెన్సేషన్. దాదాపు గ్రామ్ ఫోన్సెట్టు ఉన్న ప్రతి ఇంట్లోనూ వీరి రికార్డింగులు ఉండేవి. ‘‘అయ్యయ్యో చేతులో డబ్బులు పోయెనే’’ (కులగోత్రాలు), వంటి పాటల్లో హాస్యరసం ఎంత పోషించాడో, సంగీతం క్వాలిటీ కూడా అంత ఎక్కువలో ఉంచారు. ‘‘ఆరాధన’’ సినిమా కోసం ఘంటసాల చేత పాడించిన ‘‘నా హృదయంలో నిదురించే చెలీ ’’ పాట అదే బాణీతో మొదట వచ్చింది బెంగాలీలో.. ఈ పాట బాణీ కాపీ కొట్టినా, బెంగాలీ బాణీలో లేని జీవం మన తెలుగు బాణీలో కనబడుతుంది. 1970లో వచ్చిన ‘‘చిట్టిచెల్లెలు ’’ సినిమా కోసం స్వరపరిచిన ‘‘ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది ’’ బాణి ఒక పాశ్చాత్య బాణీకి కాపీ, కానీ, ఈ పాటలోని వైవిధ్యాన్ని గమనిస్తే, దీన్ని పూర్తిగా ఒక తెలుగు పాటగా మార్చిన రాజేశ్వరావుని అభినందించకుండా ఉండలేము. ‘‘చెంచులక్ష్మి ’’ సినిమా కోసం పాడిన ‘‘పాల కడలిపై శేషతల్పమున పవళించేవా దేవా’’ పాట మన ఇళ్లలో పూజా సమయంలో పాడుకొనే భక్తి పాటగా మారిపోయింది. ఇలా ఎన్ని పాటలని గుర్తుపెట్టుకోగలం. సినిమాల్లో వీణ, సితార్ వంటి వాయిద్యాలని పాటల ద్వారా పరాకాష్ఠకు తీసుకువెళ్ళింది సాలూరే.
‘‘నీవు లేక వీణ పలుకలేన న్నది’’ (డాక్టర్ చక్రవర్తి), ‘‘పాడెద నీ నామమే గోపాలా’’(అమాయకురాలు) వంటి పాటల్లో చరణానికి, చరణానికి మధ్య స్వరకల్పనలో వీణను పూర్తిగా వాడారు రాజేశ్వరరావు. ఏ రంగంలోనైనా క్రియేటివిటి కొంతవయస్సు వరకూ ఉండి తరువాత తగ్గడం సహజం. కానీ, రాజేశ్వర రావుకి వయస్సు మీద పడ్డా తగ్గలేదు. దానికి ఉదాహరణే 1977లో సాలూరి స్వరకల్పన చేసిన ‘‘ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు’’ పాట ఎప్పటికీ ఎవర్గ్రీనే. అక్టోబర్ 26, 1999న కన్నుమూసిన సుస్వరాల రాజేశ్వరరావుకి నివాళులర్పించి ఓ సారి ఆయన్ని గుర్తుచేసుకుందాం. ఎనెన్నో అద్భుత స్వర కల్పనలు చేసిన సాలూరి తెలుగు పాట ఉన్నంత కాలం మనందరిలో సజీవుడే.