కెరియర్ స్టార్టింగ్ లోనే తారాస్థాయికి చేరిపోయి.. వరుస సినిమాలకు బుక్కైపోయి... తర్వాత వచ్చిన పెద్దసినిమాలు వదులుకోవలసిన పరిస్థితిని ఎదుర్కొంటున్న హాట్ బ్యూటీ సమంతకు కొంతలో కొంత ఉపశమనం లభించింది. ఓపక్క పాత కమిట్ మెంట్స్ పూర్తి చేసుకుంటూ... మరోపక్క కొత్త సినిమాలు కమిట్ అవుతూ ... ప్రస్తుతం కెరియర్ ప్లాన్ చేసుకుంటూ బిజీ బిజీగా వున్న చెన్నయ్ అందం సమంతా, తాజాగా పవన్ కల్యాణ్ పక్కన నటించే అవకాశాన్ని అందుకుంది. పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మించే భారీ చిత్రంలో నటించడానికి సమంతా సైన్ చేసింది. ఇందులో కథానాయికగా మొదట్లో నిత్యా మీనన్ ని అనుకున్నారు. అయితే, సమంతా డేట్స్ దొరకడంతో చివరికి ఆమెనే ఫైనల్ చేసినట్టు చెబుతున్నారు. 'జల్సా' వంటి హిట్ చిత్రం తర్వాత పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందే ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నాడు. వచ్చే నెలలో ఈ చిత్రం షూటింగు మొదలవుతుంది. ఇక పవన్ సమంతా ల రొమాన్స్ ను పవన్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయబోతున్నారన్నమాట.

ఇదిలా ఉండగా, 'కెమెరామేన్ గంగతో రాంబాబు' సినిమాతో రెండు మూడు రోజుల పాటు సంచలనానికి కారణమైన దర్శకుడు పూరీ జగన్నాథ్, ఇప్పుడు తన ఫేవరైట్ ప్లేస్ బ్యాంకాక్ లో వున్నాడు. తను త్వరలో మహేష్ బాబు హీరోగా రూపొందించనున్న చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను అక్కడ ప్రారంభించాడు. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తాడు. ఈ చిత్రం కూడా రాజకీయ నేపథ్యంలో రూపొందుతుందని అంటున్నారు. ఇటీవల జరిగిన సంఘటనలతో మనస్తాపానికి గురైన పూరీ, మరింత కసితో ఈ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడట. అయితే, ఈసారి పర్టిక్యులర్ గా ఎవరికీ దొరకని విధంగా, తెలివిగా స్క్రిప్టును తయారుచేస్తున్నాడట.
...avnk