
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రియేటివ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మూవీ కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం మీద విమర్శనాస్త్రాలు సందిస్తూనే ఉన్నారు రాజకీయనేతలు. తాజాగా చిత్రం వివాదంపై ఏకంగా సమాచార, ప్రసారాల శాఖ మంత్రి డీకే అరుణే సీరియస్ అయిపోయారు. తెలంగాణపై అభ్యంతరకర సన్నివేశాలను పరిశీలించి తొలగించేందుకు కమిటీ ఏర్పాటుకు ఆమె శనివారం ఆదేశించారు. తక్షణ చర్యలు తీసుకోవాలని డీకే అరుణ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను ఆదేశాలు జారీ చేశారు. రాంబాబు చిత్రంలో కొన్ని సన్నివేశాలు తెలంగాణ ప్రాంతాన్ని అవమానపరిచే విధంగా ఉన్నాయన్నారు. దర్శక, నిర్మాతలు ఆ సన్నివేశాలను వెంటనే తొలగించాలని మంత్రి సూచించారు. అలాగే 'ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం'చిత్రంపై ఆమె అభ్యంతరం తెలిపారు. అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని ఆదేశించారు. లేకుంటే ప్రభుత్వమే కమిటీ వేసి చర్యలు తీసుకుంటుందన్నారు. సినిమా వినోదంగా ఉండాలే తప్పా ప్రాంతాన్ని, వర్గాన్ని కించపరిచేలా ఉండకూడదన్నారు. ఇటువంటి సినిమాలు రావటం దురదృష్టకరమని, సెన్సార్ బోర్డు సభ్యులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డీకే అరుణ పేర్కొన్నారు.
కాగా, అభ్యంతరకర దృశ్యాలను తొలగిస్తే చిత్ర ప్రదర్శనకు తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాని నైజాం ఏరియాలో కొన్ని చోట్ల తెలంగాణా వాదులు నిలిపివేసినప్పటికీ మిగతా అన్ని ఏరియాల్లో కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఒక్క సీడెడ్ లోనే కొంత కలెక్షన్స్ తక్కువగా వచ్చాయి కానీ వారాంతం మరియు దసరా ఉండడంతో పుంజుకునే అవకాశం ఉంది. ఈ సినిమా మొదటి రోజు ఓపెనింగ్ కలెక్షన్స్ షేర్ సుమారు 9 కోట్లు, ఇది ఒక రికార్డ్. కృష్ణా జిల్లాలో రెండవ రోజు కూడా సుమారు మొదటి రోజుతో సమానంగా 66 లక్షలు షేర్ కలెక్ట్ చేసింది. మూవీ టీంకు తెలంగాణ వాదులకు ఏర్పడిన సఖ్యత కారణంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి నైజాంలోనూ షోలు ప్రదర్శింపబడతాయి.
కాగా, కెమరామెన్ గంగతో రాంబాబు సినిమా ప్రదర్శనను టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ,తెలంగాణా ప్రజాసంఘాలు అడ్డుకోవడంపై పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో పవన్ అభిమానులు కెసీఆర్, దర్శకుడు శంకర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. ఓట్ల కోసం, రాజకీయాల కోసం సినిమా అడ్డుకుంటున్నారని విమర్శించారు.
..avnk