
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు(55) శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. గురువారం నాడు విశాఖపట్టణంలో ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో రణస్థలం మండలం దండానపేట కూడలి వద్ద ఎర్రన్నాయుడు ప్రయాణిస్తున్న కారు పెట్రోల్ ట్యాంకర్ను ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది.ఈ దుర్ఘటనలో ఎర్రన్నాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన ఆయనను శ్రీకాకుళంలోని కిమ్స్ సాయి శేషాద్రి ఆసుప్రతికి తరలించారు. ఆయన వెన్నుపూస, గుండె భాగాల్లో తీవ్రంగా గాయలవడంతో డాక్టర్లు ఎంత ప్రయాణించినప్పటికీ ఆయనను బతికించలేకపోయారు.

ఎర్రన్నాయుడు మరణవార్త వినడంతో టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మహబూబ్నగర్ జిల్లాలో పాదయాత్రలో ఉన్న చంద్రబాబు ఈ రోజు యాత్ర రద్దు చేసుకుని ఎర్రన్నాయుడు అంత్యక్రియలకు శ్రీకాకుళం జిల్లాకు బయలుదేరనున్నారు. ఎర్రన్నాయుడు మృతి పట్ల టీడీపీ నేతలందరూ తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన మృతి టీడీపీకి తీరని లోటు, ఆ లోటును భర్తీ చేయడం కష్టం అని నేతలు కొనియాడారు. ఆయన స్వగ్రామం నిమ్మాడలో శుక్రవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, మరో ఇద్దరు గాయపడ్డారు. విశాఖపట్టణంలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై శ్రీకాకుళంకు తిరిగొస్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది. వీరు ప్రయాణిస్తున్న కారు మలుపుతిరుగుతున్న ఆయిల్ ట్యాంకర్ను ఢీకొంది. ఎర్రన్నాయుడు మరణవార్త తెలుసుకుని ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఎర్రన్నాయుడు హఠాన్మరణం పట్ల టీడీపీ నేతలు సంతాపం ప్రకటించారు.కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో 1957, ఫిబ్రవరి 23న వ్యవసాయ కుటుంబంలో ఎర్రన్నాయుడు జన్మించారు. కళావతమ్మ, దాలినాయుడు ఆయన తల్లిదండ్రులు. ఏడుగురు సంతానంలో ఆయన మొదటివారు. గారలో ఉన్నతవిద్య, టెక్కలీ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్య అభ్యసించారు. విశాఖ వీఎస్ కృష్ణా కళాశాలలో బీఎస్సీ చదివారు. ఆంధ్రా యూనివ ర్సిటీలో ఎల్ఎల్బీ చేశారు. 1982, మే 28న విజయకుమారిని వివాహమాడారు. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు.

