
తెలుగు దేశం పార్టీ అధినేత పాదయాత్ర చేస్తూనే మరొ పక్క పార్టీని ప్రక్షళనం చేస్తున్నాడు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన వారి పై వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. నిన్న తంబళ్లపల్లె ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తెలుగుదేశం పార్టీ ఈరోజుపశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే వనితపై సస్పెన్షన్ వేటు వేసింది. గత కొంతకాలంగా వనిత పార్టీ విధానాలను ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. తనను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించినందుకే టీడీపీ తనను ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని గోపాలపురం ఎమ్మెల్యే వనిత వాపోయారు. తన సొంత నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీ తనను టార్గెట్ చేస్తోందని... తన స్థానంలో మరొకరిని ప్రోత్సహిస్తుండటంతో మనస్తాపానికి గురయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యే అయినా తాను పార్టీ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని తెలిపారు. పార్టీ విధానాలను ప్రశ్నించినవారందరినీ టీడీపీ వదిలించుకుంటున్నట్లు కనిపిస్తోందని, పొమ్మనలేక పొగపెట్టడానికే తనను సస్పెండ్ చేశారని వనిత అన్నారు. తర్వలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆమె తెలిపారు. నవంబర్ 4వ తేదీన వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వనిత వెల్లడించారు.
