ఇంగ్లీష్ చదువులు వద్దు... తెలుగు భాషే ముద్దు అని కొందరు పెద్దలు చెబుతారు. అయినా తల్లిదండ్రులు వినకుండా ఇంగ్లీష్ చదువులు చదివించినందుకు ఓ చదువుల సరస్వతి ప్రాణాలు తీసుకుంది. వివరాల్లోకి వెళితే... బొడ్డువారిపాలేనికి చెందిన పాస్టర్ జాన్రాజ్ కుమార్తె ప్రవల్లిక (16) సత్తెనపల్లి శివారులోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటిసంవత్సరం చదువుతోంది. ఆమె పదోతరగతి వరకు తెలుగు మాధ్యమంలోనే చదివింది. ఆంగ్ల మాధ్యమం అర్థం కావడం లేదని, తెలుగులోనే చదువుతానని ప్రవల్లిక ఎన్నిసార్లు చెప్పినా తల్లిదండ్రులు వినలేదు. ఇటీవల దసరా సెలవులకు ఇంటికివచ్చిన ప్రవల్లికను సోమవారం ఉదయాన్నే కళాశాలకు వెళ్లాలని సూచిం చారు. మానసికంగా ఆందోళనకు గురైన ప్రవల్లిక ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలోఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ ఇమామ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.