
రేపు కేంద్ర కేబినెట్ విస్తరణలో ఆంధ్రప్రదేశ్ లోని నాయకుల పంట పండనుంది. ఇంత వరకు ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ నుండి అధిక మందికి పదవులు కట్టబెట్టనున్నారు. ఇప్పటికే మన రాష్ట్రం నుండి ఉన్న మంత్రులలో కొందరికి ప్రమోషన్ లు ఇస్తూ, కొత్తగా ఐదుగురిని చేర్చుకోనున్నారు. ఈ కేబినెట్ విస్తరణకు రేపు ఉదయం 11.30 గంటలకు ముహుర్తం నిర్ణయించిన విషయం తెలిసిందే. రేపు జరగబోయే విస్తరణలో కొత్తగా చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ రెడ్డి, బలరామ్ నాయక్, కిల్లి కృపారాణి, సర్వే సత్యనారాయణలకు మంత్రి వర్గంలో స్థానం లభించే అవకాశం ఉంది. ఇప్పటికే జైపాల్ రెడ్డి,కిషోర్ చంద్రదేవ్, పురందేశ్వరి, పల్లంరాజు, పనబాక లక్ష్మీ కేంద్ర మంత్రులుగా ఉన్నారు. కొత్తగా స్థానం పొందే చిరంజీవికి పర్యాటక శాఖ సహాయ మంత్రి, కృపారాణికి ఆరోగ్యశాఖ సహాయ మంత్రి, బలరామ్ నాయక్కు సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి, సూర్యప్రకాశ రెడ్డికి నౌకాయాన శాఖ సమాయ మంత్రి, సర్వే సత్యనారాయాణకు రైల్వే శాఖ సహాయ మంత్రి పదవి లభిస్తాయని తెలుస్తోంది. అయితే పార్టీని విలీనం చేసిన చిరంజీవికి సహాయశాఖ మంత్రి పదవి ఇస్తే స్వీకరిస్తాడో లేదో చూడాలి.
