
సామాజిక ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్ సంధించిన ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఆయనపై మరోసారి ఎదురుదాడికి దిగారు. దేశంలోని పెద్ద రాజకీయ పార్టీలపై ఆరోపణలు సంధించడం ద్వారా వాటిని నాశనం చేసి ఆ స్థానాన్ని ఆక్రమింకోవాలని కేజ్రీవాల్ ‘పగటి కలలు’ కంటున్నారని ఖుర్షీద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఏనుగు’ లాంటి కాంగ్రెస్ పార్టీతో ‘చిన్న చీమ’ లాంటి కేజ్రీవాల్ తలపడటం వ్యర్థ ప్రయత్నమే అవుతుందని ఖుర్షీద్ అభిప్రాయపడ్డారు. ఖుర్షీద్, ఆయన కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ఎన్జిఓలో ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నట్టు కేజ్రీవాల్ ఇంతకుముందు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్ తన సొంత ఎన్జిఓకు అందిన విదేశీ విరాళాల వ్యవహారంలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, ఇతరులపై బురద చల్లే ముందు కేజ్రీవాల్ తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పుకోవాలని పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుర్షీద్ హితవు పలికారు. ఫరూఖాబాద్ నియోజకవర్గాన్ని సందర్శించాలని తలపెట్టిన కేజ్రీవాల్ను తాను బెదిరించినట్టు వచ్చిన ఆరోపణలను ఖుర్షీద్ తోసిపుచ్చారు. ‘కేజ్రీవాల్ను నేనెందుకు బెదిరిస్తాను? దాని ద్వారా నేను సాధించేది ఏముంది? కేజ్రీవాల్పై దాడి చేయడానికి ఆయన స్థాయి ఎంత? ఆయన ఒక ‘చిరుజీవి’ ఎంతో బలమైన కాంగ్రెస్ పార్టీతో తలపడే స్థాయి ఆయనకు లేదు. వంద చీమలు కలసినా ఏనుగును ఏమీ చేయలేవు. అటువంటిది కేవలం ఒక చిన్న చీమ ఏనుగును ఏమి చేయగలుగుతుంది?’ అని ఖుర్షీద్ అన్నారు.
