
పొద్దుపొడవక ముందే కాఫీ, టీలతో పాటు సప్త వర్ణాల ప్రపంచాన్ని మీ ముంగిట ఆవిష్కరించే ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక అనివార్య పరిస్థితుల్లో ఈ రోజు ఒక భారమైన వార్తను మీకు నివేదిస్తున్నది. మీకు తెలుసు, న్యూస్ ప్రింట్, ఇంకులతోపాటు అన్నిరకాల ముద్రణ సామగ్రి ధరలు కొంతకాలంగా అసాధారణంగా పెరిగాయి. డాలర్తో రూపాయి మారకం రేటు పడిపోవడం గోటి చుట్టుపై రోకటి పోటుగా పరిణమించింది. డీజిల్ ధర పెరిగింది. విద్యుత్ చార్జీలు విపరీతంగా పెరిగాయి. ఉద్యోగుల వేతన భత్యాలు కూడా బాగా పెరిగాయి. ఇలా అనేకానేక కారణాల వల్ల పత్రిక నిర్వహణ భారం విపరీతంగా పెరిగిపోయింది. గత నాలుగేళ్లలో ఇరానీ చాయ్ ధర కూడా నాలుగు దఫాలుగా మూడు రూపాయల నుంచి ఎనిమిది రూపాయలకు పెరిగిన విషయం గమనించాలి. ఎన్నిరకాలుగా, ఎంత భారం మీద పడినా, ఇతర భాషా పత్రికలు పలు దఫాలు ధర పెంచినా తెలుగు పత్రికలు మాత్రం చాలా కాలంగా ధర పెంచని విషయం పాఠక మహాశయులు అంగీకరిస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు కూడా పత్రికా నిర్వహణ భారం ఇక ఏ మాత్రం మోయలేని పరిస్థితుల్లోనే అయిష్టంగానే పత్రిక ఇష్యూ ధర పెంచాలని యాజమాన్యం నిర్ణయించింది. పత్రిక ధర పెంచడానికి దారి తీసిన పరిస్థితులను పాఠకులు సహృదయంతో అర్థం చేసుకుంటారని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా ఎదిగిన ఈ పత్రిక మరింత నిలదొక్కుకోవడానికి సహకరిస్తారని ఆశిస్తున్నాం.
ప్రస్తుత ధర
సాధారణ రోజులు : రూ. 3.00
ఆదివారం : రూ. 3.50
