
జి మెయిల్ యూజర్స్ కు శుభవార్త. ఇంటర్నెట్ సెర్చి దిగ్గజం గూగుల్ తమ ఉచిత ఎస్ఎంఎస్ సర్వీసులను భారత్లో ప్రవేశపెట్టింది. దీనితో జీమెయిల్ యూజర్లు చాట్ ద్వారా అన్ని టెలికమ్ నెట్ వర్క్ మొబైల్ ఫోన్లకు ఉచితంగా ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. ఇందుకోసం ఎటువంటి చార్జీలు చెల్లించనక్కర్లేదు. ఇప్పటిదాకా ఉత్తర అమెరికా, ఆఫ్రికా, ఆసియాలో 51 దేశాల్లో ఈ సర్వీసులు లభిస్తున్నాయి.
అయితే, ఎస్ఎంఎస్ పంపడానికి యూజర్లు ఆయా ఫోన్ నంబర్లను తమ కాంటాక్ట్ లిస్టులో చేర్చాలి. ఎస్ఎంఎస్లకు వచ్చిన సమాధానాలు జీమెయిల్ చాట్లో కనిపిస్తాయి. ప్రారంభంలో గూగుల్ ప్రతి యూజర్ అకౌంట్లో 50 ఉచిత ఎస్ఎంఎస్లు క్రెడిట్ ఇస్తుంది. మెసేజి పంపిన ప్రతిసారీ ఒకటి తగ్గిపోతుంది. అయితే, అవతలి వారు స్పందించిన పక్షంలో ఒకో రిటర్న్ మెసేజీకి 5 ఎస్ఎంఎస్ల క్రెడిట్ యూజర్ ఖాతాలో జమవుతుంది. ఒకవేళ క్రెడిట్ లిమిట్ పూర్తిగా అయిపోతే ప్రతి 24 గంటలకి ఒక క్రెడిట్ జమవుతుంది.
ఈ సేవలు అందిపుచ్చుకోవాలంటే..జిమెయిల్ చాట్ ఇంటర్ఫేస్లో ఫోన్ నంబరు టైపు చేయాలి. తర్వాత సెండ్ ఎస్ఎంఎస్ క్లిక్ చేయాలి. దాన్ని అందుకునే వారి పేరు, దేశం పేర్కొని, సేవ్ చేయాలి. ఆ తర్వాత నుంచి చాట్ విండోలో ఎస్ఎంఎస్ టైపు చేసి, ఎంటర్ నొక్కితే చాలు ఎస్ఎంఎస్ వెడుతుంది. ఇలా పూర్తిస్థాయిలో ఫ్రీ ఎస్ ఎం ఎస్ వాడేసుకోవచ్చు. మరెందుకాలస్యం జిమెయిల్ ఉంటే సరేసరి లేకుంటే అకౌంట్ క్రియేట్ చేసుకుని వర్తమానాల పరంపర కొనసాగించేయండి మరి..
...avnk