ఇటీవల సంవత్సరాలలో ఐరోపా రచయితల వైపే మొగ్గిన నోబెల్ కమిటీ ఈసారి అనూహ్యంగా చైనా రచయిత మో యాన్కు నోబెల్ బహుమతిని ప్రకటించింది . ప్రతిష్ఠాత్మక అవార్డుకు విజేతలను ఎంపిక చేసే స్వీడిష్ అకాడమీ మో ‘భ్రమాజనిత వాస్తవికతావాదం ’ (హెలూసినేటొరిక్ రియాలిజం)ను కొనియాడింది . ఆయన రచనలు జనపద గాథలను, చరిత్రను, సమ కాలీనతను విలీనం చేస్తాయంటూ ప్రశంసించింది. పురస్కారాన్ని ప్రకటించే ముందు అకాడెమీ మోను కాంటాక్ట్ చేసిందని అకాడెమీ శాశ్వత కార్యదర్శి పీటర్ ఇంగ్లాండ్ తెలిపారు. ఆయన ఎంతో సంతోషపడ్డారని, భయపడ్డారని ఇంగ్లాండ్ చెప్పారు. సాహిత్యంలో నోబెల్ గెలుచుకున్న తొలి చైనా జాతీయుడు మో అయినప్పటికీ, వాస్తవానికి తొలి చైనీయుడు కాదు. ఫ్రాన్స్కు వలస వెళ్ళిన చైనీయుడు గావో గ్జింగ్జియాన్ 2000వ సంవత్సరంలో తన నవల సోల్ మౌంటెన్కు నోబెల్ను గెలుచుకున్నారు.