
కావేరీ జలాల విషయంలో రాష్ట్రరైతులకు, ప్రజలకు అన్యాయం చేయొద్దని ప్రధాని డా.మన్మోహన్సింగ్కు ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ విజ్ఞప్తి చేశారు. కావేరీ నదీ పరీవాహక ప్రాంతంలోని వాస్తవ స్థితిగతుల ఆధారంగా తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన ఆయన తన అధికార నివాసం కృష్ణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కావేరీ జలాల విషయంలో రాజకీయం తగదని అన్ని పార్టీలకు హితవు పలికారు. వాస్తవ స్థితిని వివరించేందుకు ప్రధాని అపాయింట్మెంట్ కోరానని అయితే అటువైపు నుంచి స్పందన రాకపోవడం తనను నిరుత్సాహ పరిచిందని శెట్టర్ పేర్కొన్నారు. తాము ఎక్కడా సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదని సీఎం వివరించారు. కావేరీ జలాల విడుదలను నిలిపివేయడం ఉల్లంఘన కిందకు రాదన్నారు. న్యాయ నిపుణులతో సమగ్రంగా చర్చించిన పిమ్మటే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసే పిటీషన్లను చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. వర్షాభావ స్థితి కారణంగా కావేరీ రిజర్వాయర్ ప్రాంతంలోని 49 తాలూకాలలో 12 లక్షల ఎకరాల ప్రదేశాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. ఈనెల 12న సుప్రీంకోర్టులో జరిగే విచారణ సందర్భంగా రాష్ట్ర వాదనను బలంగా వినిపిస్తామన్నారు. 11న ఢిల్లీలో జరిగే కావేరీ ప్రాధికార సమావేశానికి ముఖ్య కార్యదర్శి హాజరవుతారని చెప్పారు. నవంబర్ చివరి వారంలో శాసనసభ సమావేశాలను బెల్గాంలో నిర్వహించాలన్న ఆలోచన ఉందన్నారు.
