
అధికారాన్ని అడ్డు పెట్టుకొని చేసిన పాపాలను ప్రాయశ్చిత్తంతో ప్రక్షాళన చేసుకొన్న తర్వాతనే.. పాదయాత్ర మొదలు పెట్టాలని వైఎస్ కుమార్తె షర్మిలకు టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య సూచించారు. 'ఇడుపుల పాయ మొదలుకొని వైఎస్ కుటుంబం కడప జిల్లాలో దళితుల నోరుకొట్టి వారికి చెందిన వెయ్యి ఎకరాల భూములను మూడు తరాలపాటు తమ ఆధీనంలో ఉంచుకొని అనుభవించింది. అసెంబ్లీలో దీనిపై పెద్ద గొడవ జరిగినా ఒక్క ఎకరం కూడా దళితులకు తిరిగి ఇవ్వలేదు. వారి భూముల సరసన దళితులు ఉండటాన్ని సహించలేకపోవడమే దీనికి కారణం. ఇడుపులపాయ నుంచి పాదయాత్ర మొదలు పెట్టే ముందు అక్కడ తమ ఆధీనంలో ఉన్న భూములను దళితులకు పంచి వారిని క్షమాపణ కోరాలి' అని ఆయన డిమాండ్ చేశారు. షర్మిల తన భర్త అనిల్ కుమార్తో కలిసి ఖమ్మం జిల్లాలో 1.40 లక్షల ఎకరాల ఇనుప ఖనిజం భూములను తన తండ్రి అధికారంలో ఉండగా.. రక్షణ స్టీల్స్కు రాయించుకొన్నారని గుర్తుచేశారు. ఈ విధంగా రాయించుకోవడం తప్పేనని ప్రజల ముందు ఆమె అంగీకరించాలని ఆయన కోరారు. జగన్ను ఆదర్శంగా తీసుకోవాలని ప్రజలను కోరే నైతికధైర్యం విజయలక్ష్మికి లేదా షర్మిలకు ఉందా అని ప్రశ్నించారు. జగన్ , వాద్రా ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టిన చీడ పురుగులని విమర్శించారు.
