తెలుగువాడి వాడిని, వేడిని, నటనను, రాజకీయాన్ని విశ్వవ్యాప్తం చేసిన తెలుగువారి అరాధ్యుడు, తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా తన స్థానాన్ని పధిలం చేసుకున్న గొప్పనటుడు నందమూరి తారక రామారావు. వెండితెరపై జానపద, పౌరాణిక, సాంఘిక... ఇలా జోనర్ ఏదైనా తనదైన నటనతో చెరగని ముద్రవేసిన గొప్ప నటుడు. భారతీయ సినీ చరిత్రలో తెలుగువారి గోప్పదనాన్ని చేర్చి.. సువర్ణాక్షరాలతో లిఖించిన నటుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించాలని వచ్చిన అలోచనే అద్భుతం.
అయితే ఎన్టీఆర్ ప్రయాణం..సాధించిన మైలురాళ్లు ఎందరికో స్ఫూర్తిదాయకం. దాంతో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేసినప్పటి నుండి అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా హిస్టరీలోనే నటించనంత మంది భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమాతొలిభాగం ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం విడుదల కావడంతో ఈ ఆలోచనకు ఎలా వుందన్న ప్రశ్నకు వావ్ బాలకృష్ణ.. వావ్ క్రిష్ అంటూ తెలుగు ప్రేక్షకులు ఇది అత్యద్భుత ఆవిష్కరణ అంటూ కితాబిస్తున్నారు.
1984 బ్యాక్ డ్రాప్ లో చెన్నై అడయార్ క్యాన్సర్ హాస్పిటల్లో బసవ తారకమ్మ(విద్యాబాలన్) చికిత్స తీసుకుంటూ ఉంటుంది. ఆమెను కలవడానికి అక్కడికి ఆమె కొడుకు హరికృష్ణ (కల్యాణ్ రామ్) వస్తాడు. ఆమె యన్.టి.ఆర్ ఆల్బమ్ చూడటంతో సినిమా స్టార్ట్ అవుతుంది. నందమూరి తారక రామారావు (బాలకృష్ణ) రిజిస్ట్రార్ ఆఫీస్ లో పనిచేస్తుంటాడు. అక్కడ లంచాలు తీసుకుని ప్రజలకు సేవ చేయడాన్ని సహించలేక మానేసి సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. మద్రాస్ చేరుకుని ఎల్.వి.ప్రసాద్ కలుస్తాడు. అక్కడి నుంచి ఆయన జీవితంలో సినిమా ఓ భాగంగా ఎలా మారింది. నటుడి నుంచి అగ్ర కథానాయకుడిగా ఎదిగే క్రమంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? ఆయనకు చేసిన పాత్రలు, ఆయన ప్రయాణం.. ఇతరులతో ఆయన మెలిగే తీరు.. సినిమాలపై ఆయనకున్న కమిట్ మెంట్.. అంతా కథనాయకుడు చిత్రంలో నిక్షిప్తమైంది. దీంతో పాటు ఆయన వ్యక్తిగత జీవితంలో పలు మలుపులు తిరిగిన సన్నివేశాలను కూడా పోందుపర్చారు.
విశ్లేషణ
ఎన్టీఆర్ జీవితంలో ఏం చూడాలనుకుంటున్నారో.. ఏం తెలుసుకోవాలనుకుంటారో.. అవన్నీ తెరపై చూపించాడు దర్శకుడు. ఎన్టీఆర్ సినిమా రంగ ప్రవేశం చేసిన తర్వాత ఆయన పోషించిన పాత్రలన్నీ ప్రతి ఐదు నిమిషాలకోసారి మనకు దర్శనమిస్తాయి. అదంతా పండగలా ఉంటుంది. ఆయా పాత్రల్లో బాలకృష్ణ అభిమానులను అలరిస్తారు. దర్శకుడు ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలపై ఎక్కువ దృష్టిపెట్టాడు. ఎన్టీఆర్-బసవతారకం మధ్య ఉన్న అనుబంధం చూసి ఆశ్చర్యపోతారు.
ఒక భర్త.. భార్యకు ఇంతలా ప్రాధాన్యం ఇస్తారా? అనిపిస్తుంది. ఎన్టీఆర్ జీవితంలో చోటు చేసుకున్న ప్రతి మలుపు కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు. మనదేశం, రైతుబిడ్డ చిత్రాల్లో ఎన్టీఆర్కు ఎలా అవకాశం వచ్చింది? తోటరాముడి పాత్ర ఎలా దక్కింది. కృష్ణుడిగా ఎన్టీఆర్ కనిపించినప్పుడు ఎదురైన సంఘటనలను దర్శకుడు చాలా చక్కగా చూపించాడు. కొన్ని సన్నివేశాలు రోమాలు నిక్కబొడిచేలా ఉంటాయి. కుటుంబమా? సినిమానా? ఏది ముఖ్యం అంటే ‘నాకు సినిమానే ముఖ్యమ’ని ప్రారంభ సన్నివేశాల్లో ఎందుకు ఎన్టీఆర్ చెప్పారనే దానికి సమాధానం విరామానికి ముందు తెలుస్తుంది.
తనయుడు చావుబతుకుల్లో ఉన్నా సరే నిర్మాత నష్టపోకూడదన్న ఉద్దేశంతో షూటింగ్కు వచ్చిన ఒక మహానటుడిని తెరపై చూస్తాం. ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎందుకు రావాలని అనుకుంటున్నాడు.. అందుకు ప్రేరేపించిన అంశాలు ఏంటి? కథానాయకుడి జీవితం నుంచి రాజకీయ నాయకుడిగా ఎలా ఎదగాలని అనుకున్నాడది ప్రీక్లైమాక్స్లో కనిపిస్తుంది. దివిసీమ ఉప్పెన నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్లు, గుండెలను మెలి తిప్పేలా చూపించాడు దర్శకుడు. అభిమానులకు తెలిసిన విషయాలు, తెలియని విషయాలు అత్యంత నాటకీయంగా, సహజంగా దర్శకుడు తెరపైకి తీసుకొచ్చాడు.
నటీనటుల విషానికి వస్తే
ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరపై చూపించడం అనుకున్నంత సులభం కాదు. ఎందుకంటే ప్రతి పాత్రకు ఒక ఔచిత్యం ఉంది. దానికి తగిన నటీనటులను ఎంచుకోవాలి. ఆ విషయంలో దర్శకుడు క్రిష్, అతని బృందం నూటికి నూరుపాళ్లు విజయం సాధించింది. ప్రతి పాత్రా పోత పోసినట్లే అనిపిస్తుంది. చాలా పాత్రలు కేవలం ఒక్క సన్నివేశానికి మాత్రమే పరిమితమైనవే. అయినా, అలాంటి సన్నివేశాలు కూడా రక్తికట్టాయి. ఎన్టీఆర్ గా బాలకృష్ణ.. ఎన్నో విభిన్న గెటప్పుల్లో కనిపించారు.
ప్రతి రూపానికి ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా పౌరాణికానికి సంబంధించిన చిత్రాల్లో ఆయన ధరించిన కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి పాత్రల్లో బాలకృష్ణని చూసినా.. అన్నగారిని తలచుకోని తెలుగువాడు వుండడు. ఇప్పటికీ ఎన్టీఆర్ వేసిన కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వరుడి చిత్రపటాలకు నిజమైన దేవుళ్లగానే పూజలు చేసే అభిమానులు వున్నారంటే అతిశయోక్తి కాదు. బసవతారకంగా విద్యాబాలన్ ఈ సినిమాకు ప్రాణం పోశారు. ఆమెను ఎంచుకోవడమే ఈ సినిమాకు ప్రధాన బలం.
ఆతర్వాత అభిమానులను ఎక్కువగా ఆకట్టుకునేది అక్కినేని నాగేశ్వరరావు పాత్ర. అక్కినేనిగా సుమంత్ చాలా చక్కగా కనిపించారు. కొన్ని సన్నివేశాల్లో నిజంగా ఏయన్నారేమోననిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎన్టీఆర్-ఏయన్నార్ల అనుబంధాన్ని కూడా తెరపై అందంగా ఆవిష్కరించారు. ఒక రకంగా ఏయన్నార్ బయోపిక్లా కూడా అనిపిస్తుంది. సినిమాలో ఎక్కువ సన్నివేశాల్లో కనిపించే మరో ముఖ్యమైన పాత్ర త్రివిక్రమరావు. ఆ పాత్రలో దగ్గుబాటి రాజా చక్కగా నటించారు. చంద్రబాబుగా రానా పాత్ర చివరిలో తళుక్కున మెరుస్తుంది.
టెక్నికల్ అంశాలకు వస్తే..
ఈ సినిమా అత్యున్నతంగా ఉంటుంది. దర్శకుడు క్రిష్ ప్రతిభను మెచ్చుకోక తప్పదు. అభిమానులకు ఏం కావాలో అవన్నీ చూపించగలిగారు. ఎన్టీఆర్ చరిత్ర ఒక పాఠంలా మిగిలిపోయేలా ఈ సినిమా ఉంటుంది. ఎం.ఎం. కీరవాణి అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ప్రతి ఫ్రేమూ చాలా అందంగా చూపించారు. అన్నింటికన్నా బుర్రా సాయిమాధవ్ రాసిన సంభాషణలు ఆయువుపట్టు. ప్రతి సన్నివేశంలో ఒక మెరుపులాంటి సంభాషణ ఉంటుంది.
ఎన్టీఆర్ ఉద్యోగం కోసం వెళ్లినప్పుడు లంచం అడిగితే ఎవడి ఇంటికి వాడు యజమాని. లంచం తీసుకునేవాడి ఇంటికి ఎంతమంది యజమానులు అన్న డైలాగ్ చప్పట్లు కొట్టిస్తుంది. మొత్తం చూస్తే, అటు నటీనటులు, ఇటు సాంకేతిక నిపుణులు చేసిన అద్భుత ప్రయత్నం యన్.టి.ఆర్. కెమెరామన్ పాత్ర కూడా చాలా కీలకం. ఆ పాత్రకు నిరవ్ పూర్తి న్యాయం చేశారు. సినిమాను సాగదీయకుండా ఎడిటర్ ఆంటొని బాగా ఎడిట్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
తీర్పు..
తెలుగు వారి ఆరాధ్యుడి గొప్పతనాన్ని, ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటిన చిత్రం.. ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు.. తరతరాల తెలుగువారికి ఒక దిక్సూచీ, ఒక స్పూర్తి, ఒక మార్గదర్శి. భావి తరాలకు ఆయన జీవిత విశేషాలను అందించే ప్రయత్నం బాగుంది.
చివరగా... భావితరాలకు మహానుభావుడి జీవిత పాఠం....