గోవింద్ భార్గవ్ అలియాస్ విందా(బొమన్ ఇరానీ) ఏబీ సంస్థలకు అధిపతి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విందాని, అతని తనయుడిని వ్యాపార లావాదేవీలు కారణంగా చంపేస్తారు. దాంతో విందా భార్య ఇంద్రాణి (ఖుష్బూ) అస్సాం నుంచి బాలసుబ్రమణ్యం(పవన్ కళ్యాణ్) అనే వ్యక్తిని తీసుకొచ్చి మేనేజర్గా నియమిస్తుంది.
ఓవైపు మేనేజర్గా వ్యవహారాలు చేసుకుంటేనే.. విందా హత్యకు కారకులెవరనే దానిపై ఆరా తీస్తుంటాడు బాలసుబ్రమణ్యం. ఇంతకు విందాను హత్య చేసిందెవరు? అసలు బాలసుబ్రమణ్యమెవరు? అస్సాం నుండి ఏబీ మేనేజర్గా రావడానికి కారణాలేంటి? బాలసుబ్రమణ్యం, అభిషిక్త్ భార్గవ పాత్రలకు ఉన్న సంబంధం ఏంటి?.. ఇంద్రాణి ఏరి కోరి బాలసుబ్రమణ్యాన్ని తీసుకురావటానికి కారణమేంటి అన్నదే కథ.
పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అజ్ఞాతవాసి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేదిలు బ్లాక్ బస్టర్ లు కావటంతో అజ్ఞాతవాసిపై కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను వాళ్లు అందుకున్నారా? చూద్దాం.
విశ్లేషణ:
సాధారణంగా త్రివిక్రమ్ సినిమా అంటే ఆడియన్స్ ప్రాస డైలాగులు, కామెడీ, ఆసక్తికరమైన కథనం లాంటివి ఆశిస్తుంటారు. కానీ, అజ్ఞాతవాసిలో ఇవి లోపించాయి. వినోదాత్మక అంశాలను చూపించే ఆస్కారం ఉన్నా త్రివిక్రమ్ ఎందుకనో వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేశాడనిపించాడు.
ఇక కథ విషయానికొస్తే.. మొదటి నుంచి చెబుతున్నట్లు ఫ్రెంచ్ మూవీ లార్గో వించే ప్రధాన కథను దర్శకుడు తీసుకున్నాడు. పూర్తి రివెంజ్ డ్రామాగా కాకుండా దానికి లవ్, ఫ్యామిలీ డ్రామా అనే రంగులు అద్దాడు. ఫస్టాఫ్ మొత్తం తన సరదాగా సాగిపోయే సన్నివేశాలే ఉన్నప్పటికీ.. ఎందుకనో త్రివిక్రమ్ మార్క్ కామెడీ మాత్రం కాలేకపోయింది. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి కథలో ఊపు మొదలై సెకండాఫ్ పై ఆసక్తి పెంచుతుంది.
అయితే ఎమోషనల్, రివెంజ్ సీక్వెన్స్ తో సాగే సెకండాఫ్ లో కీలకమైన ట్రాక్ ను కూడా బోరింగ్ మలిచాడు దర్శకుడు త్రివిక్రమ్. కథ లాజికల్ గా ఉన్నప్పటికీ వీరి కాంబినేషన్ నుంచి ఆశించే స్థాయి ఎంటర్ టైన్ మెంట్ ను కూడా అందించలేకపోయాడు. దీనికి తోడు వీకైన విలనిజం సినిమాను పెద్ద దెబ్బే కొట్టింది. చివర్లో క్లైమాక్స్ కామెడీ పంచ్ తో ముగించినప్పటికీ అది పెద్దగా హెల్ప్ కాలేకపోయింది.
నటీనటుల విషయానికొస్తే... బాలసుబ్రమణ్యం, అభిషిక్త్ భార్గవ రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో పవన్ కళ్యాణ్ తన నటనను ప్రదర్శించారు. ఎప్పటిలాగే తనదైన శైలి ఎంటర్ టైనర్ తో ఆకట్టుకున్నాడు. ఫైట్స్, సెంటిమెంట్ సీన్లలో అభినయంతో వన్ మాన్ షోగా సినిమాను నిలబెట్టాడు. దాదాపు ప్రతీ ఫ్రేమ్ లోనూ పవన్ ను చూపించాడు దర్శకుడు. ఇక కుష్బూ ఇంద్రాణి క్యారెక్టర్ లో మెప్పించారు. సవతి తల్లి, కొడుకుల మధ్య సెంటిమెంట్ సీన్లు ఉండి ఉంటే బాగుండేది.
హీరోయిన్స్ గా సుకుమారి(కీర్తి సురేష్), సూర్యకాంతం(అనూ ఇమ్మాన్యూయేల్) ఆకట్టుకున్నప్పటికీ.. పాత్ర ప్రాధాన్యం పెద్దగా లేకుండా పోయింది. దీనికి తోడు హీరోతో వీరి కాంబోలో వచ్చే సీన్లు కాస్త ఇరిటేట్ చేస్తాయి. రావు రమేష్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ కొన్ని నవ్వులు పంచారు. ఆది పినిశెట్టి కార్పొరేట్ విలన్ గా ఫర్వాలేదనిపించాడు. తనికెళ్ల భరణి, జయ ప్రకాశ్, శ్రీనివాస్ రెడ్డి, సంపత్ పరిధి మేర నటించారు. అయితే అంతా చెప్పుకున్నట్లు సీనియర్ నటుడు వెంకటేష్ ఎపిసోడ్ లేకపోవటం నిరాశ కలిగించే విషయం.
టెక్నికల్ అంశాల విషయానికొస్తే.. అనిరుధ్ సంగీతం ఫర్వాలేదు. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలోనే అతను తడబడ్డాడు. కొటగిరి ఎడిటింగ్ ఫస్టాఫ్ కి కుదిరినప్పటికీ.. సెకండాఫ్ లోనే గందరగోళానికి గురి చేసే సన్నివేశాలుండటంతో వాటి విషయంలో శ్రద్ధ వహించాల్సింది. మణికందన్ అందించిన సినిమాటోగ్రఫీ అధ్బుతంగా ఉంది. ప్రతీ ఫ్రేమ్ లోనూ అతను సినిమాను అందంగా చూపించేందుకు కష్టపడ్డాడు. హరికా అండ్ హసిని సంస్థ వారి నిర్మాణ విలువలు చాలా గ్రాండ్ గా ఉన్నాయి.
తీర్పు :
అయితే సంక్లిష్టమైన ఆ కథను సులువుగా మలచాలన్న ప్రయత్నం బెడిసికొట్టిందనే చెప్పాలి. తండ్రి మరణానికి పగ తీర్చుకునే కొడుకు.. లాంటి మూస కథలను ఎంటర్ టైనింగ్ అండ్ పవర్ ఫుల్ గా చూపించగలిగే ఛాన్సు ఉన్నా.. అనుభవజ్ణుడైన త్రివిక్రమ్ మాత్రం ఆ విషయంలో దారుణంగా తడబడ్డాడు. స్క్రీన్ ప్లే పై త్రివిక్రమ్ శ్రద్ధ వహించి ఉంటే అజ్ఞాతవాసి ఫలితం మరోలా ఉండేది.
చివరగా.. అజ్ఞాతవాసి... అభిమానులకు ఓకే