అనగనగా ఓ ఊళ్లో జై లవ కుశ(ఎన్టీఆర్) అనే ముగ్గురు కవలలు ఉంటారు. సోదరులను ఎంతగానో ప్రేమగా చూసుకునే జై కి రాను రాను కోపం పెరిగిపోతుంటుంది. అందుకు కారణం జై నత్తిని ఎగతాళి చేస్తూ వాళ్లు వేధించటం. దీనికి తోడు మావయ్య జైని మరింతగా అవమానాల పాలు చేస్తుంటాడు. భరించలేని జై కోపంత వాళ్లందరిని చంపాలని చూస్తాడు. ఈ క్రమంలో ఆ ముగ్గురు సోదరులు విడిపోతారు.
తిరిగి పెద్దాయ్యాక లవ, కుశలు కొన్ని పరిస్థితుల కారణంగా తిరిగి కలుస్తారు. వారిద్దరు ఒకరి సమస్యలు ఒకరు పరిష్కరించుకుంటున్న సమయంలో అనుకోని సమస్య వచ్చి పడుతుంది. అదే వాళ్ల అన్న జై. తన అవసరాల కోసం వాళ్లిద్దరిని కిడ్నాప్ చేసి తన సామ్రాజ్యానికి తీసుకెళ్లిన జై చివరకు ఏమౌతాడు? ఆ అన్నదమ్ముల కథ ఎలా ముగుస్తుంది? అన్నది తెలియలంటే జై లవ కుశ చూడాల్సిందే.
హ్యాట్రిక్ హిట్లు కొట్టి ఊపుమీదున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పవర్ ఫేమ్ బాబీ డైరక్షన్ లో రూపొందిన చిత్రం ‘జై లవకుశ’. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయడం.. పైగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఒకటి అందులో ఉండటంతో అంచనాలు బాగానే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నేడు రిలీజ్ అయిన ఈ చిత్రం ఏ మేర ఆకట్టుకుందో చూద్దాం.
విశ్లేషణ:
టాలీవుడ్ చరిత్రను ఓసారి తిరగేస్తే... అన్నదమ్ముల సవాల్, ముగ్గురు మొనగాళ్లు లాంటి చిత్రాలు ఇదే కథను చూపిస్తాయి. అయితే పక్కా స్క్రీన్ ప్లేతో కథను నడిపించటం దర్శకుడికి సవాలే. కానీ, బాబీ ఇక్కడ ఏ సూత్రాన్ని పాటించలేదు. కానీ, తెలివిగా చేసిన పని ఎన్టీఆర్ ను హీరోగా సెలక్ట్ చేసుకోవటమే. ప్రారంభంలో ఓ 20 నిమిషాలపాటు పరమ బోరింగ్ గా అనిపించే లవ కుశ.. తర్వాత కుశ ఎంటైర్ టైనింగ్ పార్ట్ తో గాడిన పడి నెమ్మదిగా మొదలౌతుంది. అక్కడి నుంచి మెల్లిగా అసలు కథలోకి ఎంటర్ అయ్యి ఇంటర్వెల్ బ్యాంగ్ జై క్యారెక్టర్ తో పీక్స్ లోకి వెళ్లిపోతుంది.
అయితే సెకండాఫ్ లో ఆ ఊపు కొనసాగటంలో తడబడినా చివరి 30 అన్నదమ్ముల మధ్య వచ్చే ఎమోషన్లు ఆకట్టుకుంటాయి. అదే సమయంలో కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు మరీ సిల్లీగా అనిపించకమానవు. ప్రి క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ సినిమాకే హైలెట్. తన తమ్ములను వాడుకుంటూ జై సమస్యలను సాల్వ్ చేసుకోవటం వినోదాత్మకంగా తెరకెక్కించాడు. క్లైమాక్స్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. మొత్తానికి జై లవ కుశ సగటు ప్రేక్షకుడిని మెప్పించే సినిమానే.
నటీనటుల విషయానికొస్తే.. ఎన్టీఆర్ నటనా కౌశలం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నటనలో చెలరేగిపోయే తారక్.. మూడు డిఫరెంట్ రోల్స్ లోనూ చెలరేగిపోయాడు. ముఖ్యంగా ముందు నుంచి చెప్పుకుంటున్న జై పాత్రలో. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా బాబీ జై పాత్రను పండించాడు. సినిమా అయిపోయాక కూడా పెర్ఫామెన్స్ మాత్రమే కళ్ల ముందు కదలాడుతుంది. సినిమాలో ఉన్న మైనస్ లను తన యాక్టింగ్ తో ఫ్లస్ గా మార్చేశాడు.
ఇక హీరోయిన్లు పెద్దగా చేసిందేం లేదు. రాశీ ఖన్నా, నివేదా థామస్ లు ఇద్దరిదీ పరిమిత పాత్రలే. పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో కొంతవరకు నవ్వించాడు. ప్రవీణ్ పర్వాలేదు. విలన్ రోనిత్ రాయ్ ప్రత్యేకత ఏమీ లేదు. మిగతా వాళ్లంతా ఓకే.
టెక్నికల్ అంశాల విషయానికొస్తే... దేవిశ్రీ ప్రసాద్ సంగీతం జస్ట్ ఓకే. స్క్రీన్ పై రావణా.. తేలిపోయా సాంగ్స్ బాగున్నాయి. జై పాత్ర ప్రవేశించిన దగ్గర్నుంచి నేపథ్య సంగీతం మరో స్థాయిలో ఉంటుంది. ఛోటా కె.నాయుడు కెమెరా పనితనం బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర్నుంచి ఆయన ప్రత్యేకత కనిపిస్తుంది. కోన వెంకట్-చక్రవర్తి కలిసి అందించిన స్క్రీన్ ప్లే.. కోన గత సినిమాల స్టయిల్లోనే సాగింది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నప్పటికీ.. సెట్స్ పేలవంగా కనిపించటం చెప్పుకోదగ్గ విషయం.
తీర్పు:
జై లవ కుశ పెద్ద ప్రత్యేకమైన కథేం కాదు. అలాగని సాదాసీదా స్టోరీతోనే సినిమాను నడిపించేందుకు దర్శకుడు ప్రయత్నించలేదు. మూడు రోల్స్ కు సమానమైన పాత్రను ఆవిష్కరించి.. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలతో జై పాత్రను డిజైన్ అతడి చేతికి అప్పగించడంతోనే బాబీ తన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేసేశాడు. ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ పరంగా చూస్తే ఇది ప్రత్యేకమైన సినిమా అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా బోర్ కొట్టించకుండా టైంపాస్ చేయించే కమర్షియల్ అంశాలకు లోటు లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ తోపాటు మాస్ ప్రేక్షకుల్ని మురిపించే ప్యాకేజీలాగా ఉంటుంది.ః
చివరగా... ‘జై లవకుశ’ కొత్తదనం లేదు కేవలం ఎన్టీఆర్ ఫెర్ఫార్మెన్సే కోసమే...