వైజాగ్ లో ఉండే సాయి (నాగశౌర్య) అనుకోకుండా లక్ష్మి ఆనంద్ (అవికా గోర్)ను చూసి ప్రేమిస్తాడు. లక్ష్మి తండ్రి ఆనంద్ రావు (రావు రమేష్) కొన్ని నియమాలు పాటించే వ్యక్తి. అనుకోని కారణాలతో సాయిపై ఆనంద్ రావుకు ద్వేషం కలుగుతుంది. లక్ష్మి ఆనంద్ రావు కూతురు అని తెలియని సాయి ఆమె ప్రేమను పొందేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. అటు లక్ష్మి మాత్రం తన తండ్రి చెప్పిన వారినే పెళ్ళి చేసుకుంటాను అని చెప్తుంది. ఈ సమయంలో లక్ష్మిని సాయి ఎలా మెప్పిస్తాడు...? ఆనంద్ రావు పెళ్లికి ఒప్పుకుంటాడా.., అసలు వీరిద్దరి మద్య వివాదానికి కారణాలేమిటి అనేది వెండితెరపై చూడండి.
‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమాలతో రెండు వరుస హిట్లు కొట్టిన నాగ శౌర్య.., హ్యాట్రిక్ ఆశలతో తీసిన సినిమా ‘లక్ష్మి రావే మా ఇంటికి’. యంగ్ లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న శౌర్య.., ఫ్యామలి ఎంటర్ టైనర్ ను ఖాతాలో వేసుకోవాలని ఈ మూవీలో నటించాడు. తొలి సినిమా ‘ఉయ్యాల జంపాల’తో హిట్ సాధించిన అవికా గోర్ నటించిన ఈ మూవీని నంద్యాల రవి తెరకెక్కించాడు. గిరిధర్ ప్రొడక్షన్ హౌజ్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమాకు రాధాకృష్ణన్ సంగీతం అందించాడు. ఆడియో సూపర్ హిట్ కావటంతో.., భారీ అంచనాల మద్య విడుదల అయిన ‘లక్ష్మి రావే మా ఇంటికి’ ఎలా ఉందో రివ్యూ మీ కోసం అందిస్తున్నాం.
ప్లస్ పాయింట్స్ :
నాగశౌర్యకు గతంలో రెండు సినిమాలు చేసిన అనుభవం ఉండటంతో ఈ మూవీలో మరింత ఉత్తమ నటన కనబర్చాడు, హీరోయిజంను కూడా పెంచాడు. హీరోయిన్ అవికాగోర్ నటన బాగుంది. రావు రమేష్, నరేష్ వారి పాత్రలకు న్యాయం చేశారు. సప్తగిరి కామెడి సినిమాకు ప్లస్ అవుతుంది. సినిమా ప్రారంభంలో వచ్చే గుడ్డు కథకి, క్యారెక్టర్ల పరిచయానికి బాగా ఆకట్టుకుంటుంది. కామెడి పరంగా ఎంజాయ్ చేస్తారు.
మైనస్ పాయింట్స్ :
హీరో నాగశౌర్య మాస్ ఇమేజ్ చూపించినా.., క్యారెక్టర్ ను నిలబెట్టుకోవటానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఇక అవికాగోర్ హీరోయిన్ పాత్రకు సూట్ కాలేదు. ఆడియెన్స్ మైండ్ లో చిన్నమ్మాయిలా సెట్ అయిపోవటంతో.. ఈ స్థాయి హీరోయిన్ రోల్ ను ఆస్వాదించలేరు. ఇక సినిమా కథ పరంగా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ లో ముప్పావు వంతు అలా వెళ్లిపోయి ఆ తర్వాత ఆగిపోయిందని చెప్పవచ్చు. నలబై నిమిషాల తర్వాత కథను అర్థంకాని మలుపులు తిప్పి ఇంటర్వల్ కు తీసుకొచ్చాడు. ఆ తర్వాత మంచి అంచనాతో వచ్చే ప్రేక్షకులు నిరాశపడతారు. సెకండ్ ఆఫ్ లొ మొదటి నుంచి ఇంటర్వల్ వరకు కథ ఆగిపోతుంది. అవసరం లేని చోట్ల పాటలు, అనవసరమైన ఫైట్లు పెట్టారు. కమెడియన్లలో సప్తగిరికి మాత్రమే మంచి టైమింగ్, డైలాగులు ఇచ్చారు.
కళాకారుల పనితీరు :
నంద్యాల రవి డైరెక్షన్ కు కొత్త కావటంతో సినిమా తీయటంలో తడబడ్డాడు. పాత కథను కొత్తగా చూపించాలని ప్రయోగాలు చేస్తే బెడిసికొట్టాయి. స్ర్కీన్ ప్లే పాత కథల్లాగే ఉన్నా.., అనవసరమైన సన్నివేశాలు చూపించారు. డైలాగ్స్ ను టైమింగ్, ఫీలింగ్ కంటే ప్రాసను చూశారు. దీంతో మంచి టైమింగ్ వచ్చినా ప్రాస వల్ల ఫలించలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సహజ అందాలను బాగా కవర్ చేశారు. ఫ్రేమ్ లుక్ కూడా గ్రాండ్ గా ఉంది. సంగీతం విషయంలో రాధాకృష్ణకు విడుదలకు ముందే మంచి మార్కులు పడ్డాయి. అయితే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆ స్థాయిలో ఉంటే బాగుండేది. సేమ్ స్ర్ర్కీన్ ప్లేలో అనవసరమైన మలుపులు తిప్పటంతో అవన్నీ చూపించేందుకు తపనపడి ఎడింటింగ్ సరిగా చేయలేదు. గిరిధర్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా : లక్ష్మి పూజ ఫలించలేదు.