పచ్చని పొలాల, ప్రకృతి వాతవరణంలో ఉండే రాజవరం అనే గ్రామంలో ఈ కథ మొదలవుతుంది. ఆ గ్రామంలో రాంబాబు (వెంకటేష్) కేబుల్ ఆపరేటర్ గా పనిచేస్తుంటాడు. రాంబాబు భార్య జ్యోతి(మీనా), పిల్లలు అంజు (కృతిక), అను (బేబీ ఎస్తర్)లతో కలిసి ఆనందంగా జీవిస్తుంటాడు. అదే ఊరిలో ఎప్పుడూ లంచాలు తీసుకుంటూ అందరిని భయపెట్టే వీరభద్రం(రవికాలే)కు రాంబాబుకు అస్సలు పడదు. ఎందుకంటే రాంబాబుకు ఇలాంటివి అస్సలు నచ్చదు.
రాంబాబు చాలా నిజాయితీపరుడు. అయితే అనుకోకుండా ఐజీ గీతా ప్రభాకర్ (నదియా) కొడుకు వరుణ్ కనిపించకుండా పోతాడు. అయితే ఇందుకు ఆ కేసులో రాంబాబు, అతని ఫ్యామిలీ ఇరుక్కుంటుంది. అయితే మరి రాంబాబు కుటుంబానికి ఆ కేసుకి ఏమైనా సంబంధం ఉందా? లేక వీరభద్రం కావాలనే కక్ష్యతోనే వాళ్లని ఇరికించాడా? అసలు ఇంతకి రాంబాబు ఆ కేసు నుంచి బయటపడ్డారా లేదా? ఇంతకీ గీత కొడుకు ఏమైనట్లు? అనే ఇలాంటి ఆసక్తికర అంశాలను మీరు వెండితెరమీద చూస్తేనే బాగుంటుంది.
మలయాళంలో మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘దృశ్యం’. ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేసారు. వెంకటేష్, మీనా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రంలో కృతిక, బేబీ ఎస్తర్ కీలక పాత్రల్లో నటించారు. నదియా, రవికాలే ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీప్రియ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం జులై 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ చిత్రాన్ని మీడియా వారికోసం స్పెషల్ షో వేయడం వలన మీకు ముందుగానే రివ్యూ అందజేస్తున్నాం. మరి ఈ సినిమా తెలుగులో ఎలా ఉందో ఒకసారి చూద్దామా.
మాములుగా వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఇలాంటి పాత్రలను చాలా అద్భుతంగా పండించగలడు. ఈ సినిమాలో వెంకటేష్ సినిమా మొత్తాన్ని తన భుజాలపైన నడిపించాడు. రాంబాబు పాత్రకు వెంకీ అద్భుతంగా న్యాయం చేసాడు. ఆ పాత్రకు వెంకీ తప్ప ఇంకెవ్వరూ సూట్ అవ్వరు అని అనిపించేలా చేసాడు. ఇక చాలాకాలం తర్వాత మళ్లీ వెంకీతో కలిసి నటించిన మీనా... రాంబాబు భార్య జ్యోతి పాత్రలో అద్భుతంగా నటించింది.
ఒక మధ్యతరగతి ఇల్లాలికి ఎలాంటి లక్షణాలుంటాయో అవన్నీ చాలా అద్భుతంగా పండించింది. ఎప్పటిలాగే వెంకీ, మీనాల మధ్య కెమిస్ట్రీ కుదిరింది. అలాగే ఈ సినిమాతో పరిచయమైన కృతిక, బేబీ ఎస్తర్ లు తమ పాత్రలకు సరైన న్యాయం చేకూర్చారు. ఇక నటి నదియా చాలా బాగా నటించింది. అటు ఐజీగా, ఇటు ఒక తల్లిగా అద్భుతంగా నటించింది. నెగటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవి కాలే మంచి నటనని కనబరిచాడు. ఫస్ట్ హాఫ్ లో వెంకీ – సప్తగిరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. ఇక మిగతా నటీనటులు వారివారి పాత్రలకు న్యాయం చేసారనే చెప్పుకోవచ్చు.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కథ, కథనం. నటీనటుల అద్భుతమైన నటన. వెంకటేష్ ఈ సినిమాను ఒంటి చేత్తో నడిపించాడు. సినిమాకు స్క్రీన్ ప్లే చాలా అద్భుతం. సినిమా చూస్తున్నంత సేపు తరువాత ఏం జరుగబోతుందా అనే ఉత్కంఠ కలుగుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ఎలాంటి సినిమాను కోరుకుంటారో... అలాంటి సినిమాను అందిస్తునే కాస్త సస్పెన్స్ ను కూడా జోడించి అద్భుతంగా తెరకెక్కించారు.
మైనస్ పాయింట్స్ :
మలయాళం ‘దృశ్యం’ సినిమా చూసినవారికి మాత్రం ఈ సినిమా కొత్తగా ఏం అనిపించదు. సినిమా మొత్తం మలయాళ పరిసర వాతావరణం వలె అనిపిస్తుంది. సినిమాలో కొన్ని చోట్ల సీన్స్ మరీ సాగదీసినట్లుగా అనిపించింది. దీనివల్ల జనాలకు కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది.
సాంకేతిక నిపుణులు :
దర్శకురాలు శ్రీప్రియ మలయాళ వెర్షన్ లో ఉన్నవిధంగానే మక్కికి మక్కీ దించినా కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించడంలో విజయం సాధించిందనే చెప్పుకోవాలి. నటీనటుల నుంచి తనకు కావలసిన విధంగా నటనను రాబట్టుకుంది. మాలయాళంలో విజయం సాధించినట్లుగానే తెలుగులో కూడా విజయం సాధించిందనే చెప్పుకోవాలి. ఇక శరత్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. థ్రిల్లింగ్ సన్నివేశాలకు రీరికార్డింగ్ చాలా బాగుంది. అలాగే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్ రెడ్డి తన సినిమాటోగ్రఫీతో ఈ చిత్రానికి మరింత అందాన్ని తెచ్చారు. సినిమా అంతా కూడా పచ్చని పల్లెటూరి వాతావరణంతో చాలా బాగా చూపించాడు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ విషయంలో కత్తెరకు ఇంకాస్త పనిచెప్పుంటే బాగుండేది. అలాగే మాటలు, సంభాషణలు చాలా బాగున్నాయి.
చివరగా:
ఎప్పటినుంచో ఓ మంచి చిత్రాన్ని కుటుంబసమేతంగా కలిసి చూద్దామని ఎదురుచూస్తున్న వారందరికి ఇదొక మంచి చిత్రమవుతుంది. వెంకీ కెరీర్ లోనే ఈ చిత్రం ఓ మంచి స్థానాన్ని సంపాదించుకుంది.